హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్కు ఊరట లభించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత గురువారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో పట్నా 29-27 తేడాతో విజయం సాధించింది. దీంతో సొంత గడ్డపై చివరి మ్యాచ్ను విజయంతో ముగించింది. పట్నా కెప్టెన్, 'డుబ్కీ' కింగ్ ప్రదీప్ నర్వాల్ గాయంతో బెంచ్కే పరిమితమైన ఈ మ్యాచ్లో దీపక్ నర్వాల్ 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు.
ట్యాక్లింగ్లో జైదీప్ (5 పాయింట్లు) రాణించాడు. బెంగాల్ తరపున రన్సింగ్ (7) ఆకట్టుకున్నాడు. ఆరంభంలో జాంగ్ కున్లీ సత్తాచాటడంతో బెంగాల్ 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ వెంటనే తేరుకున్న పట్నా డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టేసి స్కోరు సమం చేశారు. ఇక అక్కడి నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో స్కోర్లు సమం అవుతూ వచ్చాయి.
తొలి అర్ధభాగాన్ని పట్నా 15-12 ఆధిక్యంతో ముగించింది. విరామం అనంతరం దీపక్ జోరు కనబరచడంతో పట్నా విజయం దిశగా అడుగులు వేసింది. మరోవైపు బెంగాల్ ఆటగాళ్లు కూడా పట్టు వదలకపోవడంతో ఇంకో 3 నిమిషాల ఆట ఉండగా 25-25తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. ఈ దశలో మ్యాచ్ టై అయ్యేలా కనిపించింది. అయితే దీపక్ వెంటవెంటనే రైడింగ్లో పాయింట్లు తేవడంతో పాటు డిఫెండర్లు బెంగాల్ ఆటగాళ్లను పట్టేయడంతో విజయం పట్నా సొంతమైంది.
బెంగాల్ వారియర్స్ తరఫున రన్సింగ్ 7, మహేశ్గౌడ్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఇరు జట్లు 25-25తో నిలిచాయి. ఈ దశలో నర్వాల్ రైడింగ్లో పాయింట్ సాధించడం, ఆ వెంటనే కున్ లీ ఔట్ కావడంతో దక్కిన 2 పాయింట్ల ఆధిక్యాన్ని పట్నా కొనసాగించి గెలుపొందింది. శుక్రవారం యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడతాయి.