
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మాజీ ఛాంపియన్, టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్కు యూపీ యోధా షాక్ ఇచ్చింది. సోమవారం జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధా 31-24తో జైపూర్ను ఓడించింది. రైడర్లు సురేందర్ గిల్ (8 పాయింట్లు), శ్రీకాంత్ జాదవ్ (7 పాయింట్లు) యోధా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక జైపూర్ తరఫున స్టార్ రైడర్, కెప్టెన్ దీపక్ హుడా (9 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు.
తొలి రైడ్లోనే దీపక్ రెండు పాయింట్లు తేవడంతో జైపూర్ 2-0తో నిలిచింది. ఆ తర్వాత రైడ్లో దీపక్ను పట్టేసిన యూపీ.. ఆధిక్యంలోకి వెళ్ళింది. మరోవైపు జైపూర్ కూడా పుంజుకుని వరుస పాయింట్లు సాధిస్తూ 10-10తో స్కోరు సమం చేసింది. 18 నిమిషంలో జైపూర్ను ఆలౌట్ చేసిన యూపీ.. 16-10తో తొలి అర్ధభాగంను ముగించింది. రెండవ అర్ధభాగం మొదలవగానే దీపక్ సూపర్ రైడ్ సాధించడంతో జైపూర్ 14-17తో యూపీ స్కోరుకు చేరువగా వచ్చింది. ఈ సమయంలో దూకుడు ప్రదర్శించిన యూపీ 20-14తో ఆధిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్ చివరి వరకు అదే ఆధిక్యం కొనసాగించిన యూపీ అలవోకగా గెలుపొందింది.
లీగ్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన జైపూర్కు ఇది రెండో పరాజయం కాగా.. 9 మ్యాచ్లాడిన యూపీకి మూడో విజయం. మ్యాచ్కు హాజరయిన జైపూర్ కెప్టెన్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆటగాళ్లను ఉత్సహపరిచాడు. సోమవారం జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 30-27తో యు ముంబాపై గెలుపొందింది. లీగ్లో మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే పోటీల్లో పుణెరీతో బెంగళూరు, జైపూర్తో తలైవాస్ తలపడనున్నాయి.