హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో 'ప్లే ఆఫ్స్'కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ చతికిలపడింది. బుధవారం కీలకమైన అంతర్ జోనల్ మ్యాచ్లో ఆ జట్టు 29-37తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ గెలిస్తే పట్నాకు ప్లేఆఫ్ బెర్తు ఖాయమయ్యేది. ఇక, గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28-30తో వెనుకంజలో ఉన్న పట్నా ఆ తర్వాత మరిన్ని పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
'డుబ్కీ' కింగ్ ప్రదీప్ నర్వాల్ 2 సార్లు ఔటవడం ఫలితంపై ప్రభావం చూపింది. పట్నా తరఫున ప్రదీప్ 10 పాయింట్లు సాధించగా... గుజరాత్ తరఫున రోహిత్ 9, అజయ్ 8 పాయింట్లు చేశారు.
ప్రో కబడ్డీ: టైటాన్స్ మరో ఓటమి, ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం!
జోన్ 'బి'లో నిర్ణీత 22 మ్యాచ్లు పూర్తి చేసుకున్న పట్నా ప్రస్తుతం 55 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 52 పాయింట్లతో యూపీ యోధ నాలుగో స్థానంలో ఉంది. గురువారం బెంగాల్ వారియర్స్తో జరిగే మ్యాచ్లో ఈ మ్యాచ్లో యూపీ గెలిస్తే ఆ జట్టుకే జోన్-బి నుంచి మూడో ప్లేఆఫ్ బెర్తు 57 పాయింట్లతో సొంతం చేసుకుంటుంది. యూపీ యోధ ఓడిపోతే పట్నా పైరేట్స్ 'ప్లే ఆఫ్'కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ 'డ్రా'గా ముగిస్తే... ఇరు జట్లు 55 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు పాయింట్ల తేడా కీలకం కానుంది. ప్రస్తుతానికి పాయింట్ల తేడా పరంగా పట్నా మెరుగ్గా ఉంది.
మరోవైపు జోన్-బిలో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు ఖరారు చేసుకున్న రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్లో బంగాల్ వారియర్స్ 37-31తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. గురువారం నాటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్తో యూపీ యోధా తలపడనున్నాయి.