హైదరాబాద్: మేజర్ ధ్యాన్చంద్.... భారత హాకీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు. ధ్యాన్ చంద్ ఆటను చూసేందుకు యావత్ ప్రపంచం మొత్తం క్యూ కట్టింది. అలాంటి ధ్యాన్ చంద్ హాకీ మ్యాచ్లను చూసేందుకు టిక్కెట్ల కోసం క్యూ లైన్లో నిలబడ్డాడు అంటే మీరు నమ్మగలరా!
భారత క్రీడా రాజకీయాల కారణంగా హాకీ దిగ్గజానికి ఈ పరిస్థితి ఎదురైంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, మాజీ కెప్టెన్ గుర్భక్ష్ సింగ్ 'మై గోల్డెన్ డేస్' పేరిట రాసిన ఆత్మకథలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 1962లో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్స్ జరుగుతున్న సమయంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పటియాలా(ఎన్ఐఎస్), భారత హాకీ సమాఖ్య మధ్య గొడవ కారణంగా ధ్యాన్చంద్కు ఈ అవమానం ఎదురైందని పేర్కొన్నాడు.
'అప్పుడు ఎన్ఐఎస్ చీఫ్ కోచ్గా పనిచేస్తున్న ధ్యాన్చంద్.. ఈ టోర్నీ కోసం తన ట్రైనీలతో కలిసి పటియాలా నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. కానీ, నిర్వాహకులు ఆయనకు అడ్మిషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దాంతో, ఆయన తన ట్రైనీతో కలిసి ప్రతి మ్యాచ్ టిక్కెట్ల కోసం క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. ధ్యాన్చంద్ ఈ పరిస్థితి ఎదురవడం చాలా దురదృష్టకరం' అని గుర్భక్ష్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.
ఈ పుస్తకంలో 1967లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒలింపిక్స్కు ముందుగా జరిగిన మ్యాచ్కి సంబంధించి ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ని అప్పటి క్వీన్ ఎలిజబెత్ II లార్డ్స్ బాల్కనీలో గుండా ఆవిష్కరించారు. 1964లో జరిగిన టొక్యో ఒలింపిక్స్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించిన మ్యాచ్తో ఈ పుస్తకం ప్రారంభం అవుతుంది.
హాకీలో గుర్భక్ష్ సింగ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా గుర్భక్ష్ సింగ్ మాట్లాడుతూ 'కోల్కతా నుంచి ఢిల్లీకి థర్డ్ క్లాస్ టికెట్లో పంపించారు. జాకీర్ హుస్సేన్ నుంచి అవార్డు అందుకున్నా. అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు. కేవలం అవార్డు, సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చేవారు. కోటు, టై కూడా ఉండేవి కావు. ఈ విషయంలో నేను కంప్లైంట్ చేయడం లేదు, అలాంటి రోజుల్లో కూడా ఆడాం' అని చెప్పాడు. గుర్భక్ష్ సింగ్ రాసిన పుస్తకం వెల రూ. 1100. ఈ పుస్తకాన్ని ఆల్ స్పోర్ట్ ఫౌండేషన్ అచ్చు వేస్తోంది.