ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భాగంగా మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. గురువారం మలేసియాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 3-0 తేడాతో గెలుపొందింది. దీంతో టోర్నీని భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించి సిరీస్లో ముందంజ వేసింది. భారత స్ట్రైకర్ వందన (17వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక లాల్రెంసియామి (38వ నిమిషంలో) ఓ గోల్ చేసింది.
గోల్ లేకుండానే:
మ్యాచ్ ఆరంభంలో మలేసియా ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలో మూడు నిమిషాల్లోపే ఆ జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే భారత గోల్కీపర్ సవిత గోల్ను అడ్డుకుంది. అనంతరం భారత జోరు మొదలైంది. లాల్రెంసియామి కొట్టిన షాట్ను మలేసియా గోల్కీపర్ అడ్డుకోవడంతో.. గోల్ కాలేదు. నవనీత్ కౌర్ చేసిన గోల్ ప్రయత్నం కూడా విఫలమయింది. ఏ మాత్రం నిరాశపడకుండా.. భారత క్రీడాకారిణులు దూకుడు పెంచి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దూసుకెళ్లారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది.
మూడు గోల్స్:
రెండో క్వార్టర్ రెండో నిమిషంలో వందన ఫీల్డ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. మలేషియాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. మూడు పెనాల్టీ కార్నర్లు దక్కినా భారత్ గోల్ చేయలేకపోయింది. అయితే లాల్రెంసియామి గోల్తో భారత్ ఆధిక్యం 2-0కి పెరిగింది. కొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వందన మరో గోల్తో మెరిసింది. భారత జట్టు 3-0 తేడాతో గెలుపొందింది. శనివారం రెండో మ్యాచ్ జరుగుతుంది.