
హైదరాబాద్: ఓడితే ఇంటికే అనుకున్న సందర్భంలో ఊహకందని రీతిలో భారత్ విజయం సాధించింది. ప్రత్యర్థుల అంచనాలే కాదు వీక్షకులను సైతం తికమక పెట్టిన భారత్ ఇప్పడు మరో సమరానికి సిద్ధమైంది. బెల్జియంతో ఫైనల్ మ్యాచ్ను గెలుచుకున్న భారత్ ఇప్పుడు అర్జెంటీనాతో తలపడనుంది. ప్రపంచ నంబర్ వన్ అర్జెంటీనాను ఢీకొట్టడం కష్టమైన పనే. కానీ, అప్పటివరకు అజేయంగా దూసుకుపోతోన్న బెల్జియంను ఇలాగే దెబ్బతీసింది.
కొంతకాలంగా అస్థిర ప్రదర్శన చేస్తున్న భారత్.. సెమీస్లో ఎలా ఆడుతుందన్నది అంతుపట్టని విషయం. అయితే భారత్ బలహీనతనే బలంగా మార్చుకోనుంది. ప్రత్యర్థి అంచనా వేయడానికి కుదరని సంక్లిష్టంలో పడవేయనుంది. అందుకే అర్జెంటీనా చాలా జాగ్రత్తగా సెమీస్కు సిద్ధమవుతోంది.
'భారత జట్టును ఓడించడం చాలా కష్టం. వాళ్లు ఎలా ఆడతారో అంచనా వేయడం కష్టం. బెల్జియంతో పోరులో అది స్పష్టమైంది. భారత్ అత్యంత బలమైన జట్టును ఓడించింది' అని గురువారం క్వార్టర్స్లో అర్జెంటీనా 3-2తో ఇంగ్లాండ్ను ఓడించిన అనంతరం ఆ జట్టు డ్రాగ్ ఫ్లిక్ నిపుణుడు గొంజాలో పెలియట్ వ్యాఖ్యానించాడు.
భారత జట్టు స్టార్ స్ట్రెకర్లు సునీల్, మణ్దీప్సింగ్ గోల్స్ చేయడంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. గోల్పోస్ట్ సమీపంలో వీరిద్దరూ తడబడకుండా ఆడితే అర్జెంటీనా జట్టుపై విజయం సాధించడం ఖాయం కానుంది. మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని మిడ్ఫీల్డ్ అద్భుతంగా రాణిస్తున్నది. ప్రత్యర్థి జట్లకు పెనాల్టీకార్నర్లు అందకుండా జాగ్రత్త వహించడంలో బ్యాక్లైన్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. పెనాల్టీకార్నర్లు సాధించడం.. వాటిని గోల్స్గా మలుచడం.. అర్జెంటీనా జట్టుతో జరిగే సెమీస్ పోరులోనూ ఇదే వ్యూహం అమలు చేస్తాం. అని భారత చీఫ్ కోచ్ జియోర్డ్ మారీన్ అన్నాడు.
అర్జెంటీనాతో 46 మ్యాచ్ల్లో భారత్ 26 నెగ్గి, 16 ఓడిపోయింది. నాలుగు డ్రాగా ముగిశాయి. 2016 ఒలింపిక్స్లో ఆ జట్టును ఓడించిన ఏకైక జట్టు భారతే. కానీ ఈ సెమీస్లో అర్జెంటీనా చాలా మెరుగైన జట్టనడంలో సందేహం లేదు. మరి ఎటాకింగ్ గేమ్తో బెల్జియంను మట్టికరిపించిన భారత్.. ఆ జోరు కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరం.
మరో సెమీఫైనల్లో జర్మనీ శనివారం ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గురువారం జరిగిన క్వార్టర్స్లో జర్మనీ షూటౌట్లో 4-3తో నెదర్లాండ్స్పై గెలిచింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 3-3తో సమంగా నిలవడంతో షూటౌట్ తప్పలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.