అమ్మాయిల ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం:
తాజాగా భారత హాకీ క్రీడాకారుడు రూపిందర్పాల్ సింగ్ టోక్యో నుంచి భారత్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'జట్టు సమావేశాల్లో మేం అమ్మాయిల ఆట గురించి పదేపదే మాట్లాడుకునేవాళ్లం. వారిలాగే విజయాలు సాధించాలని అనుకున్నాం. అమ్మాయిలు తొలి మూడు మ్యాచుల్లో ఓడిపోయినా.. బలంగా పుంజుకున్నారు. క్వార్టర్, సెమీస్ ఆడారు. అది నిజంగా మాలో స్ఫూర్తి నింపింది. వారిలానే అద్బుతంగా ఆడాం' అని రూపిందర్పాల్ తెలిపాడు.
దేవుడి దయవల్లే:
'ఆస్ట్రేలియా చేతిలో 1-7తేడాతో ఓడిపోవడంతో చాలా నిరాశపడ్డాం. మేం మరీ చెడ్డగా ఆడలేదు. ఆ తర్వాత వీడియోలను విశ్లేషించినా మేం బాగానే ఆడినట్టు కనిపించింది. మాకు అవకాశాలు లభించాయి. కానీ ఆ రోజు ఆస్ట్రేలియా ప్లేయర్స్ బాగా ఆడారు. మా సర్కిల్లోకి వచ్చిన ప్రతిసారీ గోల్స్ చేశారు. ఏదేమైనా మేము ఒక కుటుంబంలా ఉండాలనే అనుకున్నాం. ఎవరినీ నిందించుకోలేదు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లాం. దేవుడి దయ ఉంది కాబట్టే పతకం గెలిచాం' అని రూపిందర్పాల్ సింగ్ పేర్కొన్నాడు.
ఎన్నో కలలు కన్నాను:
'హాకీ ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచే నేను పతకం గురించి ఎన్నో కలలు కన్నాను. ఆ సమయంలో నేనిది సాధిస్తానని అనుకోలేదు. ఎందుకో ఈ పతకం చాలా అందంగా ఉందనిపిస్తోంది. ఈ పతకం కోసం మేం డబ్బులివ్వలేదు. ఇది మా శ్రమ, అంకితభావం, త్యాగాలు, కష్టాల ఫలితం. అందరం మానసికంగా శారీరకంగా కష్టపడ్డాం. మహనీయుల వారసత్వం కొనసాగించినందుకు ఆనందంగా ఉంది. మరింత కష్టపడతాం. పతకాలు తేవడానికి ప్రయత్నిస్తాం' అని రూపిందర్ చెప్పుకొచ్చాడు.
3-4 తేడాతో ఓటమి:
మరోవైపు జపాన్ వేదికగా ముగిసిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకంపై ఎన్నో ఆశలు రేపిన మహిళల హాకీ జట్టు.. చివరికి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. కాంస్య పతకం కోసం సాగిన పోరులో రాణి రాంపాల్ సారథ్యంలోని జట్టు.. అద్భుతంగా పోరాడింది. అయితే బ్రాంజ్ మెడల్ను ముద్దాడటానికి గ్రేట్ బ్రిటన్తో తలపడిన మ్యాచ్లో చేదు ఫలితాన్ని చవి చూసింది. ఒకే ఒక్క గోల్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 3-4 గోల్స్ తేడాతో అటు మ్యాచ్, ఇటు పతకాన్ని చేజార్చుకునేలా చేసింది.