
హైదరాబాద్: పాకిస్థాన్ భారత మాజీ కోచ్ కోసం ఆరాటపడుతోంది. భారత జట్టుకు ఇచ్చిన విధంగానే తమకు సహకారాన్ని ఇవ్వాలని కోరుతోంది. మరి కొద్ది నెలల్లో మొదలవబోతున్న కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో పాకిస్థాన్ సన్నాహాలు మొదలుపెట్టింది.
కామన్వెల్త్ క్రీడల్లో తమ జట్టుకు మార్గనిర్దేశం చేయాల్సిందిగా డచ్కు చెందిన రాయిలెంట్ ఓల్ట్మన్స్ను కోరుతోంది. ఇతను భారత హకీ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన పనిచేసిన కాలంలో టీమిండియా కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించింది.
తమకన్నా బలమైన జట్లను సైతం భారత ఆయన నేతత్వంలో ఓడించింది. భారత్కు సంబంధించిన అన్ని అంచెల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఇదే అనుభవాన్ని పాక్ ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఓల్ట్మన్స్ ఒమన్లో ఉన్నారు. అక్కడే పాక్, జపాన్, ఒమన్ ముక్కోణపు టోర్నీలో తలపడుతున్నాయి.
'పాకిస్థాన్ హాకీ అధ్యక్షుడు, కార్యదర్శితో మాట్లాడేందుకు ఓల్ట్మన్స్ ఒమన్లో ఉన్నారు. ప్రస్తుత ప్రతిపాదనకు ఆయన ఒప్పుకుంటే ఏప్రిల్లో జరిగే కామన్వెల్త్ క్రీడల పోటీల్లో పాక్కు ఆయనే కోచ్గా ఉంటారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు కొంత సమయం ఇచ్చాం. 2013 నుంచి భారత్లో ఉన్న ఆయనకు అన్ని విభాగాల్లోనూ విస్తృత అనుభవం ఉంది' అని పాక్ వర్గాలు వెల్లడించాయి.
హాకీ ఇండియా 2013లో ఓల్ట్మన్స్ను హై ఫర్ఫామెన్స్ డైరెక్టర్గా నియమించింది. 2015లో వివాదాస్పద రీతిలో భారత జట్టు కోచ్గా ఎంపికయ్యారు. అద్భుత విజయాలు సాధించినప్పటికీ గతేడాది టీమిండియా ఆశించిన మేరకు రాణించలేదు. ప్రపంచకప్కే చాలా కష్టపడి అర్హత సాధించింది. దీంతో హాకీ ఇండియా గతేడాది సెప్టెంబర్లో ఆయనను పదవి నుంచి తొలగించింది.