సైకిల్ ఫ్యాక్టరీలో..
హరియాణాలోని సోనెపట్కు చెందిన నేహ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కటిక పేదరికంలో ఉన్నా.. మూడు పూటల తినడమే గగనమైనా.. ఆటనే నమ్ముకున్న ఆమె.. అద్భుత నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగింది. బాల్యం నుంచి తోడుగా నిలిచిన అమ్మ సావిత్రి దేవి అండతో.. అన్నీతానై ప్రోత్సహించిన కోచ్ ప్రీతమ్ సివాచ్ చలవతో ఇంత దూరం రాగలిగింది. తండ్రి తాగి ఇంటికి వచ్చి నానా వీరంగం సృష్టించడం.. కుటుంబ బాధ్యతను భుజాలకెత్తుకున్న తల్లి పనికి వెళ్లడం.. ఇవే బాల్యంలో నేహకు కనిపించిన దృశ్యాలు. అమ్మకు సాయంగా ఉండడం కోసం తన ఇద్దరక్కలతో కలిసి నెలకు రూ.2 వేల కోసం ఆమె కూడా సైకిల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లింది. కానీ ఆటల మీద ఇష్టం ఉండే ఆమె ప్రతి రోజూ మైదానం బయట కనిపిస్తూనే ఉండేది.
రెండు పూటల భోజనం కోసం..
హాకీ అకాడమీ నడిపే మాజీ క్రీడాకారిణి, కోచ్ ప్రీతమ్ సివాచ్ కళ్లలో పడడం వల్ల నేహ జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఓ సారి నేహకు తాడు ఇచ్చి స్కిప్పింగ్ చేయమని ప్రీతమ్ చెప్పింది. తన సామర్థ్యానికి ఆశ్చర్యపోయిన ప్రీతమ్.. హాకీ ఆడితే రోజుకు రెండు పూటలా భోజనం పెడతానని చెప్పింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించేందుకు వాళ్ల ఇంటికి కూడా వెళ్లింది. కూతురు ఇంట్లో కంటే హాకీ మైదానంలోనే సురక్షితంగా ఉంటుందని భావించిన నేహ తల్లి 11 ఏళ్ల వయసులో తనను అకాడమీలో చేర్పించింది. అప్పటి నుంచి నేహ పూర్తి బాధ్యత కోచ్ తీసుకుంది. ఆమె ప్రతి అవసరాన్నీ తీర్చి అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది.
పొట్టిగా ఉన్నా..
చిరుత వేగం, గోల్స్ చేయడంలో కచ్చితత్వంతో ఎదిగిన నేహ 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసింది. జాతీయ కోచ్ మారిజ్నె శిక్షణలో చురుకైన అటాకర్గా మారి.. ప్రత్యర్థి డిఫెన్స్ చేదించడంలో పట్టు సాధించింది. రైల్వేలో ఉద్యోగం సాధించిన ఈ 4.9 అడుగుల ప్లేయర్.. తక్కువగా ఉండే తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులకు చిక్కకుండా పరుగులు తీస్తూ ఆటలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చిరునవ్వును వదలని నేహ.. తన సంపాదనతో జూనియర్ క్రీడాకారిణులకు సాయం చేస్తుండటం విశేషం. అలాగే తన ఎదుగుదలకు కారణమైన అకాడమీకి కూడా అండగా నిలుస్తోంది.
తనలాంటి ప్లేయర్ల కోసం..
ఇటీవలే ఓ అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్న నేహ తన తల్లితో కలిసి అందులో నివసిస్తోంది. ఆ ఇంట్లో ఓ రెండు గదులను ఖాళీగా ఉంచి.. ప్రీతమ్ అకాడమీలో శిక్షణ పొందుతూ వసతి సౌకర్యం లేని ప్లేయర్లకు అందులో ఆశ్రయం కల్పిస్తోంది. 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన నేహ.. టోక్యో ఒలింపిక్స్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసే దిశగా సన్నద్ధమవుతోంది. స్పూర్తిదాయకమైన నేహా గోయల్ జీవిత ప్రయాణాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్కీబాత్లో ప్రస్తావించారు. ఒలింపిక్స్లో ఆమె అద్భుతంగా రాణించి దేశానికి పతకం అందించాలని మనం కూడా కోరుకుందాం!