2020 ఒలింపిక్స్కు భారత హాకీ జట్లు అర్హత.. ఓడినా మహిళలకు దక్కిన బెర్త్!!

భువనేశ్వర్: భారత మహిళ, పురుషుల హాకీ జట్లు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ (2020 టోక్యో)కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్లో భాగంగా శనివారం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన ఎఫ్ఐహెచ్ రెండో అంచె పోటీల్లో మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 7-1తో రష్యాను చిత్తు చేయగా.. మహిళల జట్టు 1-4తో అమెరికా చేతిలో ఓడింది. అమెరికా గెలిచినా.. రెండు మ్యాచ్లలో చేసిన మొత్తం గోల్స్లో భారత మహిళలు ముందంజలో ఉండడంతో ఒలింపిక్స్ బెర్త్ దక్కింది.

భారత్ పూర్తి ఆధిపత్యం:
శుక్రవారం జరిగిన మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత పురుషుల జట్టు శనివారం మాత్రం అదరగొట్టారు. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (23వ, 29వ నిమిషాల్లో), రూపిందర్ పాల్ సింగ్ (48వ, 59వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్తో సత్తాచాటారు. లలిత్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), నీలకంఠ శర్మ (47వ ని.లో), అమిత్ రొహిదాస్ (60వ ని.లో) తలా ఓ గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో మినహా ప్రత్యర్థిపై భారత్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది.

గోల్స్ వర్షం:
మ్యాచ్ తొలి నిమిషంలోనే అలెక్స్ సొబొలోస్కీ గోల్ చేయడంతో రష్యా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో తొలి క్వార్టర్ మొత్తం ముందంజలో నిలిచింది. 28 నిమిషాలు ముగిసేసరికే నాలుగు గోల్స్తో భారత్పై ఆధిపత్యం సాగించింది. అనంతరం భారత స్ట్రయికర్లు ఆకాశ్దీప్, రూపిందర్, లలిత్, సునీల్ పదేపదే దాడులు చేయడంతో రష్యా డిఫెన్స్ రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. దీంతో భారత గోల్ పోస్ట్పై దాడి చేయడం పక్కనుంచిన రష్యా.. తమ పోస్ట్ను కాపాడుకోవడానికే పరిమితమైంది. చెలరేగిన భరత ఆటగాళ్ల వరుస గోల్స్తో విజయం సాధించారు.

కాపాడిన రాణి రాంపాల్ గోల్:
తొలి మ్యాచ్లో అమెరికాపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల జట్టు శనివారం తడబడింది. ప్రత్యర్థి వరుస గోల్స్ తో విజృంభించడంతో ఒకదశలో ఒలింపిక్స్ బెర్త్ కోల్పోయేలానే కనిపించింది. కీలక సమయంలో కెప్టెన్ రాణి రాంపాల్ (48వ ని.లో) అద్వితీయమైన గోల్ కొట్టడంతో ఒలింపిక్ బెర్త్ దక్కింది. 36 ఏండ్ల విరామం తర్వాత రియో (2016) ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో ఆడనుంది.

ఓడినా దక్కిన బెర్త్:
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అమెరికా అమ్మాయిలు ప్రథమార్ధం ముగిసేసరికి 4-0తో ఆధిక్యంలో నిలిచారు. భారత్ గోల్ చేయడానికి ప్రయత్నించినా ఫలించలేదు. అయిదే ద్వితీయార్ధంలో కాస్త తేరుకున్న భారత్.. ప్రత్యర్థికి ఒక్క గోల్ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు ఓ గోల్ చేసింది. చివరికి 1-4తో మ్యాచ్ను భారత్ చేజార్చుకుంది. తొలి మ్యాచ్లో రాణీరాంపాల్ సేన 5-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. దాంతో రెండు మ్యాచ్లలో చేసిన మొత్తం గోల్స్ను పరిగణనలోకి తీసుకొంటే.. భారత్ 6-5తో విజయం సాధించినట్టయింది. ఫలితంగా వచ్చే ఏడాది జపాన్లోని టోక్యోలో జరిగే ఒలింపిక్స్కు బెర్త్ సొంతమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications