హైదరాబాద్: మ్యాచ్ ఏదైనా, ట్రోఫీ ఎలాంటిదైనా.. భారత్కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థానే. భారత్కు పాకిస్థాన్కు మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూసే వారు కోకొల్లలు. అలాంటిది భారత్, పాక్ల మధ్య పోరుకు మళ్లీ సమయం ఆసన్నమైంది. దీంతో ఇరు దేశాల అభిమానుల మధ్య ఉత్కంఠభరితమైన క్రేజ్ ఉంటుంది. ఈ రసవత్తర పోరును వీక్షించేందుకు అభిమానులకు మంచి అవకాశం వచ్చింది.
శనివారం హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ నెదర్లాండ్స్లోని బీహెచ్&బీసీ బ్రెడాలో అట్టహాసంగా ఆరంభంకానుంది. ఈ ఆరంభ పోరులో భారత్, పాక్ హాకీ జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పేలవ ప్రదర్శనతో నిరాశ చెందిన భారత్ నూతనోత్తేజంతో టోర్నీలో బరిలో దిగాలని ఆశిస్తోంది. గడిచిన 36 సీజన్లలో ఆసియా ఛాంపియన్స్ భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు.
చివరి టోర్నీలోనైనా టైటిల్ కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. లండన్ వేదికగా 2016 టోర్నీలో రన్నరప్గా నిలవడమే భారత్కు అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో తొలి సీజన్లోనే పాక్ విజేతగా నిలిచింది. చివరి టోర్నీలోనూ టైటిల్ నెగ్గి చిరస్మరణీయం చేసుకోవాలని పాక్ భావిస్తోంది.
2014 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు రజిత పతక విజేతగా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం టోర్నీ ముగిసే సరికి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, రేపటి పోరులో ఫేవరేట్గా బరిలోకి దిగనున్న పాకిస్థాన్.. భారత్ జట్టుపై విజయకేతనం ఎగరేయాలని భావిస్తోంది.