హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరిస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 4-0తో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (60వ), సురేందర్ కుమార్ (15వ), మన్దీపన్ సింగ్ (44వ), ఆకాశ్దీప్ సింగ్ (60వ) తలో గోల్ కొట్టారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్ భారత్కు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు.
ఈ సిరీస్లో రూపిందర్కు ఇది నాలుగో గోల్ కావడం విశేషం. అనంతరం రూపిందర్ ఇచ్చిన పాస్ను ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ సురేందర్ గోల్ పోస్ట్లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్లో వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్ ఇచ్చిన చక్కటి పాస్ను మన్దీప్ గోల్గా మలిచాడు.
మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్దీప్ మరో గోల్తో భారత్కు విజయాన్ని అందించాడు. ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆసియా గేమ్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై కోచ్ హరేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
''ఆసియా గేమ్స్ వంటి కీలకమైన ఈవెంట్కు ముందు ప్రపంచ టాప్ టెన్లోని జట్టుపై భారత్ సిరీస్ విజయం నమోదు చేయడం శుభపరిణామం. ఆసియా టోర్నీలో విజయాల నమోదుకు ఇది ఆరంభం కూడా. అన్ని కోణాల్లో ప్రణాళికాత్మక ప్రావీణ్యం ప్రదర్శించిన భారత జట్టు కొన్ని లోపాలనూ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు.