హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా జరుగుతున్న పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్ చాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చింది. పూల్-ఎలో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో ఇంగ్లాండ్పై సంచ లన విజయం సాధించింది. గత కామన్వెల్త్లో ఐదో స్థానంలో నిలిచిన భారత్.. ఈ విజయంతో గ్రూప్లో రెండో స్థానంతో సెమీస్కు చేరువైంది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (42వ), నవనీత్ కౌర్ (48వ) గోల్స్ చేశారు.
ఇక పురుషుల హాకీలోనూ భారత్ విజయాన్ని నమోదుచేసింది. పూల్-బిలో భాగంగా ఆదివారం వేల్స్ జట్టుతో జరిగిన పోరులో ఎస్వీ సునీల్ (59వ నిమిషంలో) గోల్తో భారత్ గట్టెక్కింది. ఈ మ్యాచ్లో భారత్ 4-3తో వేల్స్పై విజయం సాధించింది. మిగతా గోల్స్ను దిల్ప్రీత్ సింగ్ (16వ), మన్దీప్ సింగ్ (28వ), హర్మన్ప్రీత్ సింగ్ (57వ) చేశారు.
హాకీతో పాటు షాట్ పుట్లో కూడా: అథ్లెటిక్స్ విభాగం ఆరంభ రోజు భారత్కు మిశ్రమ ఫలితాలందుకుంది. షాట్ పుట్లో తేజిందర్ సింగ్ ఫైనల్కు చేరుకోగా.. పురుషుల 400 మీటర్ల రేసులో మొహమ్మద్ అనాస్ యహీయా సెమీస్కు అర్హత సాధించాడు. మహిళల 20 కి.మీ. రేస్ వాక్లో కుష్బీర్ నాలుగోస్థానంలో నిలవగా.. పురుషుల్లో మనీష్ ఆరోస్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక బాస్కెట్బాల్లో భారత జట్ల పోరాటం ముగిసింది. పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడు ఓటములతో సెమీస్ ఛాన్స్ను కోల్పోయాయి. జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. మహిళల వాల్ట్ ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఎనిమిది మంది పోటీ పడితే ఆఖరులో నిలిచింది. పురుషుల రింగ్ ఫైనల్లో రాకేష్ పాత్రా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.