హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్లో భారత్ పోరాటం ముగిసింది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం ఘనా జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0-4 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆనంతరం భారత జట్టు కోచ్ లూయిస్ నోర్టాన్ డి మాటోస్ మాట్లాడుతూ భారత్, ఘనా జట్ల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, ఫలితం ఊహించిందేనని అన్నారు.
'రెండు కఠిన మ్యాచ్ల తర్వాత ఘనా లాంటి జట్టుతో ఆడడం చాలా కష్టమే. ఆఫ్రికా జట్లు చాలా బలంగా ఉంటాయి. ఘనా చాలా కఠిన ప్రత్యర్థి. ఫలితం ఊహించిందే. తొలి 45 నిమిషాల్లోనే మా జట్టు శారీరకంగా అలసిపోయింది. ప్రత్యర్థి ఆటగాళ్ల వేగాన్ని అందుకునేందుకు మా ఆటగాళ్ల శక్తి చాలలేదు. మరో మ్యాచ్ ఆడాల్సిఉంటే భారత్ ఆడలేకపోయేది' అని చెప్పారు.
అయినప్పటికీ, తన జట్టుని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని మాటోస్ అన్నారు. కాగా, టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేకపోయిన ఆతిథ్య భారత జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండో మ్యాచ్లో కొలంబియాపై స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత యువకులు, పటిష్టమైన ఘనా జట్టు ముందు మాత్రం తేలిపోయారు.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్పై ఎదురుదాడికి దిగిన ఘనా ఆటగాళ్లు పోరు ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్నారు. ఘనా కెప్టెన్ ఎరిక్ అహియా రెండు గోల్స్ సాధించి జట్టు భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఘనా తరఫున కెప్టెన్ ఎరిక్ అయా రెండు గోల్స్ (43వ, 52వ నిమిషాల్లో) చేశాడు.
రిచర్డ్ డాన్సో (86వ), ఎమాన్యుయల్ టోకు (87వ) చెరో గోల్ సాధించారు. తాజా విజయంతో గ్రూప్-ఎలో ఘనా టాపర్గా నిలిచి ప్రీక్వార్టర్స్కు నేరుగా అర్హత సాధించింది.