హైదరాబాద్: భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీకి అరుదైన గౌరవం దక్కింది. పుట్టినరోజునాడు మధురమైన కానుక లభించింది. తన అద్భుతమైన నైపుణ్యంతో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాందించిన సునీల్ 34వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆసియా ఫుట్బాల్ సమాఖ్య(ఏఎఫ్సీ) ఆసియా ఐకాన్గా అతని పేరును ప్రకటించింది. ఏఎఫ్సీ తన అధికారిక వెబ్సైట్లో ఛెత్రి ఫుట్బాల్ ప్రస్థానాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.
భారత్ తరఫున 101 అంతర్జాతీయ మ్యాచ్లాడిన సునీల్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (64) సాధించిన వాళ్లలో ఆసియా నుంచి తొలి ఆటగాడిగా నిలిచిన ఛెత్రి.. వర్తమాన క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో (85), లియోనెల్ మెస్సి (65)ల తరువాత మూడోస్థానంలో ఉన్నాడు. శుక్రవారం భారత కెప్టెన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన విజయాలు, కెరీర్లో వెలకట్టలేని సందర్భాలను ఏఎఫ్సీ తమ అధికారిక పేజీలో పొందుపరిచింది.
క్రికెట్ అంటే పడిచచ్చే భారత్ లాంటి దేశంలో ఫుట్బాల్కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారుల్లో సునీల్ ఒకడు. సాకర్ను నరనరాన జీర్ణించుకున్న అతని కుటుంబంలో తండ్రి భారత ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తే..తల్లి, అత్త నేపాల్ జాతీయ జట్టులో ఆడారు. రొనాల్డో, మెస్సీలకు దీటుగా అంతర్జాతీయ ఫుట్బాల్పై సునీల్ చెరగని ముద్రవేశాడు. మెస్సీకి మరో గోల్ దూరంలో ఉన్న సునీల్.. ఆసియా గర్వించదగ్గ ఆటగాడు అని ఏఎఫ్సీ పేర్కొంది. 2005లో పాకిస్థాన్పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఛెత్రి 101 మ్యాచ్లాడి 64 గోల్స్ సాధించాడు.
2017వ సంవత్సరానికి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా:
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత పుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రెండో భారత ఫుట్బాలర్గా ఇటీవలే ఛెత్రి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.