'గేమ్ ఇన్ గేమ్..' మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ సోనా చౌదరి రాసిన ఈ పుస్తకం, ఆట వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను వెలుగులోకి తెస్తోంది. సంచలన విషయాలకు వేదికగా, ఫుట్ బాల్ అధికారుల ఆకృత్యాలను బయటపెడుతున్న ఈ పుస్తకం ద్వారా నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. అంతకుమించి ఫుట్ బాల్ అధికారుల అమానవీయ ప్రవర్తన మహిళలకు క్రీడలంటేనే భయం పుట్టేలా చేస్తోంది.
ఈ వేధింపుల పర్వం ఎంతదాకా కొనసాగిందంటే.. ఫుట్ బాల్ లో ఎంతో భవిష్యత్ ఉన్న మన్వి సింగ్ అనే ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి వేధింపులు తాళలేక అర్థాంతరంగా తనువు చాలించింది. పుస్తకంలో పేర్కొన్న అంశాల వల్ల క్రీడాకారిణిల వ్యక్తి జీవితం ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో పేర్లు మార్చి ఆయా క్రీడాకారిణులను అధికారులు ఎలా వేధించారనే విషయాలను వెల్లడించింది సోనా చౌదరి.
యూపీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కాలంలో, జట్టుకు సంబంధించిన ప్రతీ విషయంలో చురుకుగా ఉండే మన్వీ సింగ్.. ఓ టొర్నీ సందర్భంగా తమకు సరైన ఆహారం అందించకపోవడంతో, అధికారలపై తిరగబడి అందుకు నిరసనగా ధర్నా కూడా చేసింది. అనాథగా పుట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యం తనది. అలాంటి అమ్మాయి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందంటే, ఆమెను అధికారులు ఎంతగా వేధించుకు తిన్నారో అర్థం చేసుకోవచ్చు.
జాతీయ జట్టులో అందరు దీదీగా పిలుచుకునే ఓ అమ్మాయిని మేనేజర్ తనతో ఒంటరిగా హోటల్ గదికి రమ్మని వేధించిన విషయాన్ని పుస్తకంలో పేర్కొంది సోనా చౌదరి. అలాగే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ క్రీడాకారిణిని మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం జరుగుతుందనగా.. తన గదికి రావాల్సిందిగా ఫుట్ బాల్ సంఘం కార్యదర్శి లైంగికంగా వేధించాడని తెలిపింది.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ క్రీడా జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందేమోననే భయంతో, వేధింపులను మౌనంగా భరిస్తూ టోర్నీలకు సిద్దమయ్యేవారమని చెప్పుకొచ్చింది. ఇక బంగ్లాదేశ్ టూర్ కి వెళ్లిన సమయంలో ఓ స్పాన్సర్ కూతురికి, జట్టులోని క్రీడాకారిణికి ఏర్పడిన సాన్నిహిత్యం గురించి ఏమని వివరించాలో అర్థం కావడం లేదంటూ పుస్తకంలో వ్యక్తపరిచింది.
కాగా.. సోనా చౌదరి 1990వ దశకం చివరిలో భారత జాతీయ ఫుట్ బాల్ కు కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఫుట్ బాల్ క్రీడాకారిణిల దుస్థితి గురించి సోనా చౌదరి ఇంతగా చెప్పుకొచ్చిన అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యకు (ఏఐఎఫ్ఎఫ్) చీమ కుట్టినట్టైనా కావడం లేదు. ఇంతవరకు ఏఐఎఫ్ఎఫ్ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.