
హైదరాబాద్: సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీలో కేరళ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీ సాగిన ఫైనల్లో ఆ జట్టు 4-2 గోల్స్తో పెనాల్టీ షూటౌట్లో బెంగాల్ను ఓడించింది. కేరళ ఈ టోర్నీని 13 ఏళ్ల తర్వాత గెలుచుకోవడం విశేషం. ఈ మ్యాచ్లో అదనపు సమయం ముగిసే సరికి రెండు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి.
మ్యాచ్ 83వ నిమిషంలో జితిన్ గోపాలన్ సౌరవ్ దాస్ గుప్తా ఇచ్చిన క్లీన్ టాకిల్ను మిస్ చేసుకున్నాడు. మళ్లీ అదే జట్టుకు వచ్చిన అవకాశాన్ని అఫ్దాల్ వదులుకున్నాడు. ఇలా సాగుతున్న సమరంలో ఇరు జట్టు సమమైన పాయింట్లతో ఉన్నాయి. తీవ్రంగా శ్రమించిన ఇరుజట్లు మరో 30నిమిషాల వరకు ఏ గోల్ చేయలేకపోయాయి. సందీప్ భట్టచర్జీ విసిరిన గోల్ను రాజొన్ బర్మన్ వైపుగా వెళ్లింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో బాల్ వైపుగా వెళ్లిన మిధున్కు బర్మన్ కాలు గట్టిగా తగిలింది. కానీ, అది చూసిన మ్యాచ్ రిఫరీ క్రిస్టల్ జాన్ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వకపోవడం గమనార్హం.
రెండో గోల్ చేసే ప్రయత్నం 117వ నిమిషానికి సఫలీకృతమైంది. కేరళ జట్టు నుంచి జస్టిన్ జార్జ్, విబిన్ థామస్లు, పశ్చిమ బెంగాల్ జట్టు నుంచి తిర్తింకర్ శంకర్లు ఇరు జట్లకు చెరో గోల్ తో నిలిచి కాసేపటి వరకు సమంగా కొనసాగారు. పెనాల్టీ షూటౌట్లో కేరళ తరఫున రాహుల్ రాజ్, గోపాలన్, జతిన్ జార్జి గోల్స్ కొట్టగా.. బెంగాల్ ఆటగాళ్లు అంకిత్ ముఖర్జీ, నబి హుస్సేన్, ఖాన్ గోల్స్ చేయడంలో విఫలమయ్యారు.
తీర్థాంకర్, సంచాయన్ గోల్స్ చేసినా అప్పటికే 3-2 గోల్స్తో ఆధిక్యంలో నిలిచిన కేరళ.. సీసన్ గోల్ సాధించడంతో విజయాన్ని అందుకుంది. చివరిగా 2004 సీజన్లో కేరళ సంతోష్ ట్రోఫీ సాధించింది.