ముంబై: మూడు నెలల్లో భారతీయ ఫుట్బాల్ కొత్త తుది రూపుతో జవసత్వాలు సంతరించుకోనున్నది. వచ్చే ఏడాది జనవరి నాటికి భారత ఫుట్బాల్కు నూతన వ్యవస్థ ఏర్పాటవుతుందని ఏషియాన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి)కి అఖిలభారత ఫుట్బాల్ సమాఖ్య, ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డిఎల్) అధికారులు తెలిపారు.
జాతీయ ఫుట్బాల్ వ్యవస్థ రూపకల్పనకు గత మేలో సంబంధిత వర్గాలు, ప్రతినిధులు, సంఘాలతో తమ ప్రతిపాదనలు పంచుకున్నామని ఆ అధికారులు తెలిపారు. ప్రతిపాదిత నూతన ఫుట్బాల్ వ్యవస్థ మూడు లీగ్లతో ఏర్పాటవుతుందని, అందులోనే ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) కూడా ఉంటుందన్నారు.
ఐఎస్ఎల్లోకి కొత్త టీమ్లను టెండర్ల పద్ధతిలో పిలుస్తామని, ఐ - లీగ్ జట్లను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని ఎఐఎఫ్ఎఫ్, ఎఫ్ఎస్డిఎల్ తెలిపాయి. వచ్చే నవంబర్లోగా ఐఎస్ఎల్లోకి కొత్త టీంల చేరిక పూర్తవుతుందని భావించామని, కానీ దీన్ని వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశామని తెలిపారు. ఇదిలా ఉండగా భారత్ ఫుట్బాల్కు నూతన వ్యవస్థ రూపకల్పనకు చేసిన ప్రతిపాదనలపై కొన్ని క్లబ్ల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. స్పోర్టింగ్ మెరిట్లో టాప్ డివిజన్గా ఉన్న తమను తప్పనిసరిగా భాగస్వాములను చేయాల్సిందేనని తేల్చి చెప్పాయి.
జాతీయ ఫుట్బాల్కు నూతన వ్యవస్థ రూపకల్పన ప్రతిపాదనలపై బాధ్యత ప్రఫుల్ పటేల్ అధ్యక్షతన పనిచేస్తున్న అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)దేనని ఏషియాన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి) ప్రధాన కార్యదర్శి దాటో విండ్సర్ పేర్కొన్నారు. ఫిఫా అధ్యక్షుడు జియానో ఇన్ఫాంటినో మాట్లాడుతూ వారసత్వం, ఐఎస్ఎల్ క్లబ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమతూకం పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
భారత ఫుట్బాల్కు నూతన వ్యవస్థ రూపకల్పనకు జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం పూర్తిగా సానుకూల దృక్పథంతో సాగిందని.. తాము చేయూతనివ్వాల్సిన అంశాలను గుర్తించామని ఎఎఫ్సి ప్రధాన కార్యదర్శి విండ్సర్ వ్యాఖ్యానించారు. భారత్ ఫుట్బాల్ అభివృద్ధికి ఎఫ్ఎఫ్సి విజన్ కీలకమని పేర్కొన్నారు.
భారత్లో ఫుట్బాల్ లీగ్ల హోదాపై తమ మధ్య సంతృప్తికరమైన చర్చలు జరిగాయి. ప్రతిపాదిత లీగ్ వ్యవస్థలపై మరోసారి చర్చిస్తామని, కానీ తుది నిర్ణయం ఎఐఎఫ్ఎఫ్దేనని స్పష్టంచేశారు. ఇది పూర్తిగా ఎఐఎఫ్ఎఫ్ సొంత విషయమన్నారు. తాము సలహాలు, సూచనలు మాత్రమే చేయాలమన్నారు.
ఎఐఎఫ్ఎఫ్కు కొత్త లోగో
అఖిలభారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)కు కొత్త లోగోను ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో ఆవిష్కరించారు. ఏషియాన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి) అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్గోయల్, ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరుల సమక్షంలో ఆవిష్కరించారు.
నూతన లోగో త్రివర్ణ పతాకాన్ని స్ఫురింపజేస్తూ.. ఎగసిపడుతున్న జ్వాలతో ఫుట్బాల్ వైభవాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్లో ఆట ముందడుగును తెలియజేస్తుంది.