తొలిదశలో 43 మంది విద్యార్థులకు ఫుట్బాల్పై శిక్షణ:
ప్రారంభ దశలో 43 మంది విద్యార్థులకు ఫుట్బాల్పై శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు భాయిచుంగ్ భూటియా. అకడమిక్గా శిక్షణనిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నత విద్యాకోర్సులు చదివేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులు కావాలని ఆకాంక్షించే విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దేందుకు బీఎఫ్ఎఫ్ఎస్ రెసిడెన్షియల్ అకాడమీ చర్యలు చేపడుతోంది. ఐ-లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ వంటి టోర్నీలతోపాటు అంతర్జాతీయ ఫుట్బాల్ దేశంలోని లీడింగ్ క్లబ్ల్లో ప్లేయర్లుగా ఆడేందుకు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది బీఎఫ్ఎఫ్ఎస్ రెసిడెన్షియల్ అకాడమీ.
భాయిచుంగ్ భూటియా ప్రత్యేకతలివి..
నెహ్రూ కప్, ఎల్జీ కప్, ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ షిప్ టైటిల్ మూడుసార్లు, ఎఎఫ్సీ చాలెంజ్ కప్ గెలుచుకున్న భాయిచుంగ్ భూటియా 15 ఏళ్ల పాటు భారత ఫుట్బాల్కు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆయన ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెసిడెన్షియల్ అకాడమీని దీర్ఘ కాల ప్రణాళికతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20కి పైగా సెంటర్లలో 100కి పైగా కోచ్లతో క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భాయిచుంగ్ భూటియా తెలిపారు. కానీ రెసిడెన్షియల్ అకాడమీ లేకపోవడం లోటేనని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్లో ఫుట్బాల్ ప్లేయర్లకు డిమాండ్ పుష్కలం:
దేశంలో ఫుట్బాల్ ప్లేయర్లకు పుష్కలమైన డిమాండ్ ఉన్నదని తెలిపారు. అందుకు అనుగుణంగా వేదాస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ యాజమాన్యంతో ఒప్పందం కదుర్చుకుని రెండు ఫుట్బాల్ మైదానాల్లో అకాడమీ అద్భుతమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలు ఫుట్బాల్ క్రీడాకారులు కావాలని కోరుకుంటున్నా, వారి తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు దెబ్బతినొద్దని ఆశిస్తున్నారు. కానీ తాము ఆ దిశగా మేనేజ్ చేసి 43 మంది విద్యార్తులకు తొలి బ్యాచ్లో శిక్షణ ఇచ్చే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు భాయిచుంగ్ భూటియా.
ప్రతిభకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్ షిప్:
వీరిలో 80 శాతం మంది విద్యార్థులు పూర్తిగా ఫీజు చెల్లిస్తున్నారని భాయిచుంగ్ భూటియా చెప్పారు. మిగతా 20 శాతం విద్యార్థులకు మాత్రం వారి ప్రతిభకు అనుగుణంగా స్కాలర్ షిప్లు అందచేస్తున్నట్లు తెలిపారు. అకాడమీ విధి విధానాలకు అనుగుణంగా ఇటు ఫుట్ బాల్ అకాడమీలో శిక్షణ పొందుతూ మరోవైపు పాఠశాలకు వెళ్లే వారికి పూర్తిస్థాయిలో స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు. ప్రారంభ దశలో ట్రయల్స్ వేస్తున్న కుర్రాళ్లకు నాణ్యతతో కూడిన శిక్షణ అవసరం ఉన్నదని భాయిచుంగ్ భూటియా చెప్పారు. అలాగని తమ అకాడమీలో చేరిన ప్రతి విద్యార్థి పూర్తిస్థాయి పుట్ బాలర్ అవుతారని హామీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
అండర్ - 15 కేటగిరీలో శిక్షణ ఇవ్వాలని భూటియా లక్ష్యం:
ప్రస్తుతానికి అండర్ - 15 కేటగిరీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాయిచుంగ్ భూటియా అన్నారు. అండర్ - 13 పిల్లల్లో అత్యంత ప్రతిభావంతులైన వారికి స్కాలర్ షిప్ ఇస్తామని తెలిపారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో అండర్ - 13, అండర్ - 15 లీగ్లు నిర్వహిస్తోంది. ఆయా టోర్నీల్లో ఆడే శక్తి సామర్థ్యాలు కల్పించడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఏడెనిమిది ఏళ్ల క్రితం 20కి పైగా కేంద్రాల్లో ఇండియన్ ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యూ - 14, యూ - 17, యూ - 19 గ్రూపుల్లో ఆరుగురేసి ప్లేయర్లను తయారుచేయాలన్నదే తమ సంకల్పం అని భాయిచుంగ్ భూటియా చెప్పారు.
ఐఎస్ఎల్, ఐ లీగ్ ప్లేయర్ల తయారీ ప్రోత్సాహకరం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్), ఐ - లీగ్ క్లబ్ల్లో 10 - 11 మంది ఆటగాళ్లను తయారు చేశామని, ఇది తమకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు భాయిచుంగ్ భూటియా. కానీ తాము మరింత చేయాల్సింది చాలా ఉన్నదని భాయిచుంగ్ తెలిపారు. ఫుట్ బాల్ సంస్క్రుతి పట్ల భారత్ ప్రస్తుతం అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నదని అన్నారు. సౌత్ అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫుట్ బాల్ పట్ల శిక్షణ లభిస్తున్నదని తెలిపారు. దీనికితోడు భారతదేశంలోని పిల్లలు చాలా మంది ఆటల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. అలాగని ప్రతిభకు కొదవ లేదన్నారు. ఎఐఎఫ్ఎఫ్ ద్వారా నెమ్మదిగా తమ కార్యక్రమాల ద్వారా ఫుట్ బాల్ పట్ల చైతన్యం పెంచి, ప్రజల్లో పిల్లల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఆరేళ్లలోపు బాలలు హాయిగా ఎంజాయ్ చేస్తారు:
నాలుగేండ్ల నుంచి ఆరేండ్ల లోపు బాలలు ఆటను బాగా ఎంజాయ్ చేస్తారన్నారు. వయస్సుకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే అందుకు తాము కొంత క్రుషి చేయాల్సి ఉన్నదని భాయిచుంగ్ భూటియా అన్నారు. జిమ్నాస్టిక్స్, స్ట్రైచింగ్ వంటి క్రీడాంశాలతో సమన్వయం చేస్తూ ముందుకెళుతున్నట్లు చెప్పారు. తమ ప్రయాణంలో పలు అడ్డంకులు, సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వంతో అనుబంధం పెంచుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని భాయిచుంగ్ చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ సంస్థలతో టైఅప్ చేసుకున్నదేనని అన్నారు. ప్రస్తుత ప్రాజెక్టు విజయవంతమైతేనే మున్ముందు క్రీడా మంత్రిత్వశాఖతో టైఅప్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసిన పుల్లెల గోపిచంద్ తమకు స్ఫూర్తిదాయకం అని భాయిచుంగ్ భూటియా అన్నారు.