హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఔత్సాహికులను ఉర్రూతలూగించే సాకర్ ఫీవర్ కొద్ది రోజుల ముందే మొదలైంది. అయితే దీని కోసం యాజమాన్యం, ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా కొన్ని నెలల ముందుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పలు రకాలుగా సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో.. కేరళ వాసి ఏకంగా నాలుగు వేల కి.మీ ప్రయాణించి మరీ రష్యాలో మ్యాచ్ చూసేందుకు పయనమయ్యాడు.
ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా.. ఫుట్బాల్ ఆటకు ఉండే ప్రత్యేకతే వేరు. తమ అభిమాన జట్లు ఆడుతున్న మ్యాచులు చూడ్డానికి తహతహలాడతుంటారు. ఇక 'ఫిఫా ప్రపంచకప్' గురించి చెప్పనక్కర్లేదు. చిన్నపెద్దా అంతా.. టీవీల ముందు వాలిపోతుంటారు. అయితే భారత్లో కూడా ఫుట్బాల్ ఆటకు వీరాభిమానులు ఉన్నారు. కేరళకు చెందిన ఓ వీరాభిమాని..
ఫిఫా ప్రపంచకప్ 2018 పోటీల్లో తన అభిమాన జట్టు ఆడే మ్యాచును చూసేందుకు సైకిల్పై రష్యాకు వెళ్లాడు. కేరళలోని చేర్తలాకు చెందిన క్లిఫిన్ ఫ్రాన్సిస్(28) అనే యువకుడికి పుట్ బాల్ అంటే ప్రాణం. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2018 లో తన ఫేవరెట్ టీమ్ అర్జెంటీనా ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు ఫిబ్రవరి 23న తన ప్రయాణం ప్రారంభించాడు.
మొదట కొచ్చి నుంచి దుబాయ్కి విమానంలో వెళ్లాడు. దుబాయ్లో ఓ సైకిల్ కొనుక్కుని దుబాయ్, ఇరాన్, అజీర్బైజాన్ దేశాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా 4 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి రష్యాకు చేరుకున్నాడు. ఇప్పటికే ఫిఫా ప్రపంచ కప్లో 11 మ్యాచ్లు పూర్తయ్యాయి.