కొచ్చి: రెప్పపాటులో మిస్సయిన టైటిల్ కోసం కేరళ రెండేళ్ల విరామం తర్వాత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. తొలి ఐఎస్ఎల్ ఎడిషన్లో టైటిల్ ను ఎగురేసుకుపోయిన అట్లెటికో డి కోల్కతాపైనే సొంతగడ్డపై కేరళ కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం కాచుకూర్చుకున్నారు. రెండు జట్లకు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సహ యజమానులుగా ఉండటంతో ఫేస్బుక్, ట్విట్టర్లలో వారిద్దరి అభిమానుల మధ్య యుద్ధం మార్మోగుతున్నది.
కోచి స్టేడియంలో ఆదివారం సాయంత్రం 55 వేల మందికి పైగా సొంత అభిమానుల మధ్య రెండో దఫా టైటిల్ కోసం అట్లెటికో డి కోల్ కతా, కేరళ బ్లాక్ బస్టర్స్ తలపడనున్నాయి. మద్దతుదారులు, అభిమానుల మద్దతుతో ప్రస్తుత సీజన్లో లీగ్ దశతోపాటు సెమీఫైనల్స్తో కలిపి ఏడు మ్యాచ్లకు ఆరింట విజయ ఢంకా మోగించిన ఆత్మ విశ్వాసంతో స్టీవ్ కొప్పెల్ కుర్రాళ్లు బరిలోకి దిగనున్నారు. మ్యాచ్ జరిగే వేదికే కేరళ బ్లాక్ బస్టర్స్కు పెట్టని కోట కాగా, సొంతగడ్డపై మాత్రమే అట్లెటికో డి కోల్కతా.. తన ప్రత్యర్థి స్టీవ్ కొప్పెల్ శిష్యులపై విజయం సాధించిన నేపథ్యంలో కోచి స్టేడియంలో జరిగే మ్యాచ్ ఆసక్తిదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మాజీ చాంపియన్ ముద్రే సానుకూలం
తొలి ఏడాది టైటిల్ను గెలుచుకున్న జట్టుగా ఎటికెకు పరిస్థితి సానుకూలంగానే ఉంటుంది. గత మూడు ఎడిషన్లలోనూ టాప్ 4లో చోటు దక్కించుకోవడంతోపాటు మూడో ఏడాది ఫైనల్స్కు దూసుకు రావడం పొస్టిగ కుర్రాళ్లకు ప్లస్ పాయింటే అవుతుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్స్కు బాలీవుడ్ సూపర్ స్టార్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్, ఐఎస్ఎల్ చైర్ పర్సన్ నీతా అంబానీ, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ లతోపాటు సినీ రంగ ప్రముఖులు పలువురు హాజరు కానున్నారు.
క్రికెట్ ఐకాన్లుగా టెండూల్కర్, గంగూలీ అభిమానులు పూర్తిగా ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. సెకండ్ ఎడిషన్లో ఏడు మ్యాచ్ల్లో తొమ్మిది పాయింట్లతో దిగువ స్థానంతో సరిపెట్టుకున్న కేరళ బ్లాక్ బస్టర్స్ ఈ ఏడాది చెలరేగిపోయి సెమీ ఫైనల్స్ దశకు.. అక్కడ సంచలనాల మార్సిలిన్హో, ఫ్లోరెంట్ మాలౌదాల ధాటికి తట్టుకుని టైటిల్ పోరు దిశగా దూసుకొచ్చింది.
తొలి మ్యాచ్ లో ఢిల్లీ, మలి మ్యాచ్ లో కేరళ గెలుపొందడంతో ఫైనల్స్ కోసం నిర్వహించిన షూటౌట్లో కేరళ విజయం సాధించింది. మరోవైపు కోల్కతా జట్టు సెమీ ఫైనల్స్ వరకూ దూసుకొచ్చి అక్కడితో సరిపెట్టుకున్నది. ఈ ఏడాది టేబుల్ టాపర్లుగా నిలిచిన ముంబై సిటీ జట్టును సొంతగడ్డపై ఓడించి.. ముంబైలో జరిగిన మ్యాచ్లో గోల్స్ లేని డ్రాగా ముగించి ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
అర్నాబ్ మొండాల్ దూరం
శస్త్ర చికిత్స చేయించుకోనుండటంతో అట్లెటికో డి కోల్కతా డిఫెండర్ అర్నాబ్ మొండాల్ ఆదివారం జరిగే టైటిల్ పోరుకు దూరం కానున్నాడు. ఇక ఫైన్, ఆంక్షల కారణంగా బెలెంకోసో రెండు మ్యాచ్ ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నందున ఫైనల్స్లో ఆడే అవకాశం లేదు. కానీ కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు ఎటువంటి గాయం సమస్యలు లేవు. పూర్తిస్థాయిలో ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్ల కోచ్లు తమ కుర్రాళ్లతో వ్యూహాలకు పదునుపెడుతూ ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
ముంబై సిటీలో ఫోర్లాన్ టీంతో జరిగిన మ్యాచ్కు తొమ్మిది మంది ప్లేయర్లను మార్చడంతో ఎటికె కోచ్ మొలీనా బలహీనత ఏమిటో స్పష్టంగానే తెలిసిపోతుందని కేరళ కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించారు. ఈ దఫా ట్రోఫీ గెలుచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అసలు ఈసారి ఫైనల్స్ దశకు చేరుకోవడమే ఒక అద్భుతమైనా టైటిల్ తమదేనన్నాడు. అయితే మెరుగైన ఆట ప్రదర్శిస్తామని పేర్కొన్నాడు. సొంతగడ్డపై అభిమానుల మద్దతు లభించినా గతేడాది గోవాలో జరిగిన మ్యాచ్ లో చెన్నైయిన్ ఎఫ్ సి గెలుపొందిన సంగతి గుర్తుచేశాడు. ఫ్యాన్స్ మద్దతే తాము కీలకమైనా.. ఇరు జట్లు టైటిల్ కోసం హోరాహోరీ తలపడతాయని కొప్పెల్ తెలిపాడు. ఎటికె కీలక ఆటగాడు ఇయాన్ హుమ్ ను నిలువరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
గెలుపుపై మొలీనా విశ్వాసం
అట్లెటికో డి కోల్ కతా జట్టుదే టైటిల్ అని కోచ్ జోస్ మొలీనా ధీమా వ్యక్తంచేశాడు. కేరళ సొంతగడ్డపై ఆడుతున్నా తమ కుర్రాళ్లే టైటిల్ గెలుచుకోవాలని కోరుతున్నాడు. ఆయన సారథ్యంలో ఎటికె ఫైనల్స్ దశకు చేరుకోవడం ఇదే మొదటిసారి. తామెక్కడ స్థిరంగా ఆడగలుగుతామో తనకు తెలియదన్నాడు. తాము కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే ఓటమి పాలయినా అన్ని జట్ల పట్ల గౌరవం ఉన్నదన్నాడు. ప్రస్తుత సీజన్లో కేరళ బ్లాక్ బస్టర్స్ గొప్పగా ఆడుతున్నా ట్రోఫీ తమదేనన్నాడు. అర్నాబ్ మొండాల్ గాయం మినహా మిగతా ప్లేయర్ల అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. కేరళ అభిమానుల హోరు తమకు సమస్యే కాదని తేల్చేశాడు. 50 వేల మంది అభిమానులు తరలి రావడం ఫుట్ బాల్ క్రీడకు చాలా మంచిదన్నాడు. 60 వేల మంది ఫ్యాన్స్ ముందు కూడా ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు.
కేరళ డిఫెన్స్ బెస్ట్: పొస్టిగ
ప్రస్తుత సీజన్ లో కేరళ టీం డిఫెన్స్ వ్యూహం ఉత్తమమైందని ఎటికె సారధి హెల్డర్ పొస్టిగ చెప్పాడు. కానీ రెండోసారి టైటిల్ గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. ఆదివారం కోచిలో గొప్ప సానుకూల వాతావరణం నెలకొంటుందని కేరళ ఎంత కష్టమైన టీం అన్నది కూడా తాము చూస్తామన్నాడు. ఇరువైపులా టెర్రిఫిక్ ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అట్లెటికో డి కోల్ కతాకు ఇయాన్ హుమ్, కేరళకు డకెన్స్ నాజోన్, సికె వినీత్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. ఇరు జట్లలోనూ డిఫెన్స్ వ్యూహమే కీలకం కానున్నదని చెప్పాడు. కేరళ టీం స్థిరంగా డిఫెన్స్ వ్యూహంతో ముందుకు సాగుతున్నదని, ఆ టీంపై గోల్ చేయడం కష్ట సాధ్యమేనని అంగీకరించాడు.