న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్ క్రీడ ప్రోత్సాహానికి ముచ్చటగా మూడో ఏటా దిగ్విజయంగా మొదలైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అప్పుడే కాలం చెల్లిందా? అంటే అవుననే అంటున్నాయి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య వర్గాలు.
పూర్తిస్థాయిలో ఫుట్బాల్కు ప్రోత్సాహం కావాలంటే ప్రస్తుత ఫార్మాట్ నిడివిని పెంచాల్సిన అవసరం ఉందని నిర్ధారణకు వచ్చారు. ఈ ఫార్మాట్కు మెరుగులు దిద్దేందుకు మూడు, నాలుగు నెలల గడువు పడుతుందని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్), ఆసియా ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి) వర్గాలు చెబుతున్నాయి.
అభిమానుల మదిగొలిచేందుకు మూడేళ్ల క్రితం, అత్యంత బ్యూటిఫుట్ ఆటపై ఆసక్తి కల్పనకు అత్యున్నతస్థాయిలో ప్రారంభమైందే ఐఎస్ఎల్. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు భిన్నంగా మూడు నెలల పాటు సాగుతున్న ఈ టోర్నీని ముందుకు తీసుకెళ్లాలంటే నిడివి పెంచాల్సిందేనని నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఫుట్బాల్ లీగ్లు ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు సాగుతుంటాయి. ఆ విధానాన్ని ఐఎస్ఎల్కూ అనువర్తింప జేయాల్సిందే. ప్రస్తుతం పొట్టి క్రికెట్ ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మాదిరిగా నిర్వహణకు అందుకు అవసరమైన ఆవేశం ప్లస్ సమ్మోహనాన్ని కలగలుపుతూ వినోదాత్మక హంగులు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
సుమారు ఆరేడు నెలల పాటు ఐఎస్ఎల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లుచేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఫిపా నాయకత్వాన్ని అంగీకరింపజేయడంలో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విజయవంతం అయ్యారు.
ఈ ఆలోచన దేశీయ ఫుట్బాల్ అభివృద్ధికి ఉపకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫుట్బాల్ మ్యాచ్లు సైతం టెలివిజన్, స్మార్ట్ఫోన్లలో వీక్షించే స్థాయికి అభిమానాన్ని పెంపొందించి ఉన్నత స్థాయి క్రీడగా అభివృద్ధి పర్చాల్సి ఉంది.
ప్రయోగాత్మకంగా ఈ ఆలోచన అమలుకు ఆచరణ యోగ్యమే. కేవలం మూడు నెలల నిడివితో రూపొందించిన ఫార్మాట్ 'ఐఎస్ఎల్' టోర్నీని ఇతర అంతర్జాతీయ టోర్నీలతో పోలిస్తే వీక్షకుల్లో నాలుగో స్థానాన్ని పొందడం గమనార్హం. ఈ పరిణామం దేశంలో విభిన్న మార్గంలో ఫుట్బాల్ ప్రేమికులను పెంపొందిస్తూ సామాన్య జనంలోకి దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
షార్ట్ టర్మ్ లీగ్ల నిర్వహణ వల్ల అభిమానుల అటెన్షన్ను తిరిగి పొందడం తేలికవుతుంది. మూడు నెలల పాటు తమ ఫేవరెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ల వీక్షణ కోసం అభిమానులు తమ సమయాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఇది వారీ రోజువారీ జీవితంలో భాగంగా సాగుతుంటుంది. అయితే ఇక్కడో సందేహం ఉంది.
మూడేళ్ల క్రితం ఐఎస్ఎల్ ప్రారంభ మ్యాచ్లకు వీక్షకులు వస్తారా? కొన్ని రోజుల పాటు ఖాళీ స్టాండ్లే దర్శనమివ్వవచ్చునని ఫ్రాంచైసీల యజమానులైన ప్రముఖులు అభిప్రాయ పడ్డారు. కానీ ఫుట్బాల్ లీగ్ నిర్వహణకు అటువంటి సమస్యలేం తలెత్తలేదు. క్రమక్రమంగా అభిమానులు పెరుగుతూ వచ్చారు.
ఆటను ప్రోత్సహించేందుకు అవసరమైన డబ్బు ఖర్చు చేసే ఇన్వెస్టర్లు, సంస్థలు ముందుకు వచ్చాయి. ఫుట్బాల్ మ్యాచ్ల కోసం ప్రాంచైసీలు రూ.50 కోట్లు ఖర్చు పెడితే చాలన్న ధోరణితో ప్రస్తుతం పోలిస్తే ఆ ఖర్చు ఎనిమిది రెట్లు పెరిగిపోయింది. నాలుగేళ్ల క్రితం ఫిఫా - ఎఐఎఫ్ఎఫ్ సంయుక్తంగా ఐఎస్ఎల్ కోసం డిజైన్ చేసిన మార్గదర్శకాలను అదేప్పుడో దాటేసింది.
ఫ్రాంచైసీలు క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫ్రాంచైసీ ఆయా ప్రాంతాల్లోని సామాజిక వర్గాలను చైతన్య పర్చాల్సి ఉంది. తద్వారా మూడో ఏట నుంచి టీమ్లు, ఐదో ఏటా నుంచి రెసిడెన్షియల్ అకాడమీలను ప్రారంభించాలన్నది ఎఐఎఫ్ఎఫ్, ఫిఫా రూపొందించిన గైడ్లైన్స్ పేర్కొన్నాయి.
ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి ఐఎస్ఎల్ పట్ల క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది రిలయన్స్ టీమ్.. ఎఫ్సి పుణె సిటీతో అండర్ 16 స్థాయిలో ఐ - లీగ్ మ్యాచ్లో పాల్గొంటున్నది. మిగతా ఫ్రాంచైసీలు కూడా ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాల్సిందే. లేదంటే ఫ్రాంచైసీ లైసెన్స్ రద్దవుతుంది.
భారత్లో ఫుట్బాల్ పురోభివృద్ధికి పవిత్రమైన మార్గం ఐఎస్ఎల్. ఇది సమర్థవంతమైన పర్యావరణ అనుకూల వ్యవస్థను అందుబాటులోకి తచ్చింది. ఇది ఇతర లీగ్లతోపాటు జాతీయ జట్టు రూపకల్పనకు మార్గం సుగమం చేసింది. ఫుట్బాల్ను అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక సమయం పడుతుందని ఎఐఎఫ్ఎఫ్, ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ నిర్ధారణకు వచ్చాయి. దీన్ని సంప్రదాయ ఆటగా అభివృద్ధి చేయడానికి.. ఫార్మాట్ నిడివి పెంచడానికి అన్ని వర్గాల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.