ముంబై: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వచ్చే ఐఎస్ఎల్ 2021-22 సీజన్లో తుది జట్టు ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ తరహా రూల్స్ అమలుకానున్నాయి. తుది జట్టులో ఏడుగురు భారత ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్(ఎఫ్ఎస్డీఎల్) కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. గత సీజన్ ఐఎస్ఎల్లో 11 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం నలుగురు ఫారిన్ ప్లేయర్సే బరిలోకి దిగనున్నారు.
భారత్లో 2014లో మొదలైన ఈ ఫుట్బాల్ సంబరం అతి తక్కువ సమయంలోనే అభిమానుల ఆదరణను అందుకుంది. అరంగేట్ర సీజన్లో ఐదుగురు భారత ప్లేయర్లు, ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశమివ్వగా.. 2017-18 సీజన్లో తొలిసారి మార్పులు చేశారు. ఇండియన్ ప్లేయర్స్ సంఖ్యను 6కు పెంచి ఫారిన్ ప్లేయర్స్ను ఐదుకు తగ్గించారు. తాజాగా మరోసారి ఈ నిబంధనల్లో మార్పులు చేశారు.
ముగ్గురు రిజిస్టర్డ్ గోల్ కీపర్లతో ఒక క్లబ్ గరిష్టంగా 35 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను రిప్లేస్ చేసుకోవచ్చు. వచ్చే సీజన్ జట్టు సాలరీ క్యాప్ రూ.16.5 కోట్లుగా ఉండనుంది. భారత ఫుట్బాల్ ట్రాన్స్ఫర్ విండో బుధవారం ఓపెన్ కానుంది, క్లబ్లు తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.