హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తుది అంకానికి చేరుకుంది. టోర్నీలో భాగంగా మార్చి 17వ తేదీన బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సి జట్టు మాజీ ఛాంపియన్స్ చెన్నయిన్ ఎఫ్సి జట్టుతో తలపడనుంది.
టికెట్ల కోసం పుట్బాల్ అభిమానులు బారులు తీరారు. కంఠీరవ స్టేడియ సమీపంలో టికెట్లు కోసం క్యూ కట్టారు. మార్చి 14 (బుధవారం) నాడు ఆఫ్ లైన్లో టికెట్లను అమ్మకానికి ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. గురువారం బాక్సాఫీసు టికెట్లను అమ్మకానికి ఉంచారు.
అయితే, ఐఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపించడంతో టికెట్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించకుండా నివారించేందుకు ప్రభుత్వ ఐడీ కార్డులున్న వారికి విక్రయించాలని నిర్ణయించారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
ముఖ్యంగా రూ. 100, రూ. 700 విలువ గల టికెట్లను డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డులు సమర్పించిన వారికే నిర్వాహకులు విక్రయిస్తున్నారు. బెంగళూరు ఎఫ్సి జట్టుకు సంబంధించిన టీ షర్ట్లను కొనుగోలు చేసేందుకు అభిమానుల కోసం స్టేడియంలో అందుబాటులో ఉంచారు.
బెంగళూరు వేదికగా ఐఎస్ఎల్ ఫైనల్ జరుగుతుండటంతో ఆ జట్టుకు మద్దతు తెలిపేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా టికెట్లు కొనేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. పూణె సిటీతో జరిగిన రెండో సెమీ పైనల్లో బెంగళూరు జట్టు కెప్టెన్ మూడు గోల్స్ చేసి జట్టుని ఫైనల్కు చేర్చగా, తొలి సెమీ పైనల్లో ఎఫ్సి గోవాపై 4-1తో చెన్నైయిన్ విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది.