
భారత్లో ఫుట్ బాల్కు ఆదరణ తెచ్చేందుకు టీమిండియా ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఎంత తాపత్రాయపడతాడో మనకు తెలిసిందే. ఇక సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత ఫుట్బాల్ జట్టు ఇటీవలి కాలంలో చాలా మెరుగైంది. ఫుట్ బాల్ పట్ల ఇటీవల క్రేజు పెరగడానికి ప్రధాన కారణం కెప్టెన్ సునీల్ ఛెత్రి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను ఆ మధ్య మా ఫుట్బాల్ జట్టు ప్రదర్శనను ఒక్కసారి వచ్చి చూడండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు. దీంతో అతని అభ్యర్థనను మన్నించి స్టేడియానికి అభిమానులు, సెలెబ్రెటీలు పోటెత్తారు.
ఛెత్రీ తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడమే కాకుండా దేశంలో ఫుట్ బాల్ క్రీడ ఆదరణను పెంచాడు. అయితే అతనికి ఘోర అవమానం జరిగింది. డురాండ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకునే సమయంలో ఛెత్రీని పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్ పక్కకు నెట్టేశాడు. ఫోటో కోసం ఛెత్రీని పక్కకు నెట్టి ఫోటోకు పోజులిచ్చాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరలయింది. భారత కెప్టెన్ పట్ల అలా వ్యవహరించడం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. లా గణేషన్ గవర్నర్ పదవికి కలంకం అంటూ కొందరు అతనిపై విమర్శలు మొదలెట్టారు.
ఇదిలా ఉండగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో బెంగళూరు ఎఫ్సీ 2-1తో ముంబై సిటీ ఎఫ్సీని ఓడించి తమ తొలి డ్యూరాండ్ కప్ను కైవసం చేసుకుంది. బెంగళూరు ఎఫ్సి విజేతల తరఫున శివశక్తి, బ్రెజిలియన్ అలాన్ కోస్టా గోల్స్ చేశారు. బెంగళూరు కెప్టెన్ సునీల్ ఛెత్రీకి కూడా 69వ నిమిషంలో గోల్ చేయడానికి రెండు గోల్డెన్ అవకాశాలు లభించాయి. ఒకసారి అతని ఎడమ పాదంతో చేసిన స్ట్రైక్ లక్ష్యాన్ని తప్పింది. ఆపై 87వ నిమిషంలో కూడా ఒక గోల్ మిస్సయింది.