భారత జట్టుపై తీవ్ర ప్రభావం
ఫిఫా చర్య ప్రకారం తదుపరి నోటీసు వచ్చేవరకు ఏఐఎఫ్ఎఫ్ అన్ని సభ్యత్వ హక్కులను కోల్పోతుంది. ముందుగా ఈ సంచలన నిర్ణయం అండర్-17 మహిళల వరల్డ్క్పపై పడింది. భారత్లోనే ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా తేల్చింది. టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరపాలనే నిర్ణయం త్వరలోనే తీసుకుంటామంది.
అంతేకాకుండా సస్పెన్షన్ ఎత్తేసే వరకు భారత ఫుట్బాల్ క్లబ్బులు, ప్రతినిధులు, ఆటగాళ్లు, రెఫరీలు, అధికారులు ఇకపై అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి వీల్లేదు. దీంతో వచ్చే నెలలో జరిగే వియత్నాం, సింగపూర్తో భారత జట్టు ఎగ్జిబిషన్ మ్యాచ్లు, ఏఎ్ఫసీ కప్ ఇంటర్ జోనల్ సెమీఫైనల్స్లో మోహన్ బగాన్ మ్యాచ్ కూడా రద్దు కాక తప్పదు.
నిషేధం ఎత్తేయాలంటే..?
కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని రద్దు చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలపై ఏఐఎ్ఫఎఫ్ తిరిగి పూర్తి నియంత్రణ పొందితేనే సస్పెన్షన్ నుంచి వెనక్కి తగ్గే అవకాశముందని ఫిఫా పేర్కొంది. ప్రస్తుత పరిణామాలపై అత్యవసర విచారణ కోసం కేంద్రం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టు బుధవారం విచారించనుంది. వాస్తవానికి ఫిఫాకు చెందిన నలుగురు సభ్యుల బృందం, క్రీడాశాఖ సీనియర్ అధికారుల మధ్య గత శుక్రవారం, సోమవారం చర్చలు కూడా జరిగాయి. సానుకూల ఒప్పందం దిశగానే భేటీ సాగినట్టనిపించినా హఠాత్తుగా ఫిఫా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురిచేసింది
ఎన్నికలు జరిగాలి..
ఈ నిషేధాన్ని వీలైనంత త్వరగా తొలగించుకునేందుకు ఏఐఎఫ్ఎఫ్ ప్రయత్నాలు మొదలెట్టింది. మరోవైపు ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల ప్రక్రియ, కొత్త నియమావళి విషయంలో దాదాపు అన్ని ఫిఫా డిమాండ్లకు సీఓఏ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ నిషేధం స్వల్ప కాలమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ''ఈ నిషేధం స్వల్ప కాలమే అనే భావన అధికార వర్గాల్లో ఉంది. ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 28న జరగకపోయినా సెప్టెంబర్ 15లోపు మాత్రం పూర్తవుతాయి. ఫిఫా డిమాండ్లను సీఓఏ అంగీకరించింది. ఈ రకంగా చూసుకుంటే అండర్-17 ప్రపంచకప్ కూడా స్వదేశంలోనే జరిగే అవకాశముంది'' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నేడు విచారణ..
ఓటర్ల జాబితాలో ఇప్పుడు రాష్ట్ర సంఘాల నుంచి ప్రతినిధులకు ప్రాతినిథ్యం ఇవ్వడంతో పాటు మాజీ ప్లేయర్ల సంఖ్యను అయిదుకే పరిమితం చేయనున్నట్లు తెలిసింది. ఆ ప్లేయర్లతో సహా ఎగ్జిక్యూటివ్ కమిటీలో 22 మంది సభ్యులు ఉండే అవకాశముంది. ఈ పరిణామం నేపథ్యంలో వెంటనే ఏఐఎఫ్ఎఫ్కి సంబంధించిన కేసును విచారించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.
దీనిపై బుధవారం విచారణ జరగనుంది. ''ఏఐఎఫ్ఎఫ్లో సీఓఏ అధికార జోక్యాన్ని ఫిఫా వ్యతిరేకిస్తోంది. గతంలో లాగే ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మాత్రమే అధికారాలు కొనసాగించాలని అది కోరుకుంటోంది. అదే జరిగితే నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎలాగైనా అండర్-17 మహిళల ప్రపంచకప్ను స్వదేశంలోనే జరిగేలా చూడాలనుకుంటోంది'' అని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నాడు.