లిస్బన్: క్రీడా ప్రపంచంలోని మరో మేటి ప్లేయర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు స్టార్ ఫార్వర్డ్, యువెంటస్ క్లబ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) నేషన్స్ లీగ్ టోర్నీలో భాగంగా ఈరోజు స్వీడన్తో జరిగే మ్యాచ్లో రొనాల్డో పాల్గొనడం లేదని పోర్చుగల్ ఫుట్బాల్ సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది.
'క్రిస్టియానో రొనాల్డోకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. ప్రస్తుతం అతను స్వీయనిర్బంధంలో ఉన్నాడు. రొనాల్డోతో కలిసి ప్రాక్టీస్ చేసిన జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. వారందరూ స్వీడన్తో జరిగే మ్యాచ్లో బరిలోకి దిగుతారు' అని పోర్చుగల్ సమాఖ్య వివరించింది. రొనాల్డోను వైద్యులు నిత్యం పరీక్షిస్తున్నారని, అతడు త్వరలోనే కోలుకుంటాడని తెలిపింది. పది రోజులు రొనాల్డో స్వీయ నిర్భందంలో ఉంటాడని.. ఆతర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అతణ్ణి జట్టులోకి తీసుకుంటామని పోర్చుగల్ జట్టు యాజమాన్యం తెలిపింది.
ప్రాక్టీస్ సమయంలో జరిపిన పరీక్షల్లో క్రిస్టియానో రొనాల్డోకు పాజిటివ్ వచ్చింది. గతవారం నేషనల్ లీగ్లో భాగంగానే ఇటీవల స్పెయిన్, ఫ్రాన్స్లపై ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో రొనాల్డో ఆడాడు. ఆ రెండు మ్యాచులు కూడా 0-0తోనే డ్రా'గా ముగిసాయి. మరోవైపు చాంపియన్స్ లీగ్ టోర్నీ గ్రూప్ దశలో జువెంటస్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్లకు కూడా క్రిస్టియానో దూరమయ్యే అవకాశం ఉంది.
ఐదుసార్లు వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం పొందిన క్రిస్టియానో రొనాల్డో ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్లో 100 గోల్స్ పూర్తి చేసుకొని అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 101 గోల్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. 109 గోల్స్తో ఇరాన్ ప్లేయర్ అలీ దాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్, బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ నెమార్, బాస్కెట్బాల్ స్టార్ కెవిన్ డురాంట్ కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉన్నారు.
IPL 2020 ఫస్ట్ హాఫ్ పరుగుల వీరులు.. వికెట్ల ధీరులు వీరే!!