న్యూఢిల్లీ: ప్రతిపాదిత ఐ-లీగ్, ఐఎస్ఎల్ విలీనం ప్రక్రియకు 2017 ఫిబ్రవరి, మార్చి నెలల్లోపే పూర్తి కార్యాచరణ సిద్ధం చేయాలని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) భావిస్తున్నది. ఫిఫా మార్గదర్శకాలకు అనుగుణంగా ఐ-లీగ్, ఐఎస్ఎల్ టోర్నీల స్థానే పదిగానీ, 11 టీమ్లతో సరికొత్త లీగ్ కు పురుడు పోయాలని ఎఐఎఫ్ఎఫ్ తలపోస్తున్నది. ఒకింత సహనంతో, సమగ్రమైన విధానంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఎఐఎఫ్ఎఫ్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది జట్లతోపాటు ఐ - లీగ్లో ఎంపికచేసిన జట్ల సమ్మేళనంతో అవిభక్త లీగ్ రూపకల్పనకు కొంత సమయం పడుతుందని ఎఐఎఫ్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఐఎస్ఎల్తో ఐ - లీగ్ విలీన ప్రక్రియ ముగించేందుకు రఫ్ స్కెచ్ కూడా సిద్ధంచేసుకున్నది. దీంతో ఐఎస్ఎల్ అగ్రశ్రేణి ఫుట్బాల్ లీగ్గా మారుతుంది. ఇక ఐ - లీగ్ పేరు లీగ్ వన్గా రూపాంతరం చెందడంతోపాటు సెకండ్ టైర్ టోర్నీగా ఆవిర్భవించనున్నది. అయితే ప్రతిపాదిత మార్పులపై మాజీల నుంచి ప్రస్తుత ప్లేయర్ల నుంచి విమర్శలు రావడంతోపాటు ఒకింత గందరగోళం కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ఐ - లీగ్ టోర్నీ నుంచి వైదొలగనున్నట్లు మాజీ చాంపియన్స్ సాల్గావోంకర్ ఇప్పటికే ప్రకటించాడు. ఇక సహచర గోవా క్లబ్ జట్లు కూడా కొన్ని మార్గాలు ఎంచుకున్నట్లు సంకేతాలు అందుతున్నా ఆయా జట్లు తమ వైఖరి, ఉద్దేశాలేమిటో బహిరంగంగా వ్యక్తం చేయలేదు. వాస్తవంగా ఎఐఎఫ్ఎఫ్ 2017 - 18 నుంచి ఐ - లీగ్ టోర్నీకి కొత్త రూపునివ్వాలని సంకల్పించింది. ఎఐఎఫ్ఎఫ్, ఐ - లీగ్ గవర్నింగ్ బాడీలు కూడా నిర్ణీత సమయానికే ఐ - లీగ్ ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నాయి.
కానీ రెండు లీగ్ల విలీనం ప్రక్రియపై వివాదాస్పద అంశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో బహిర్గతమవుతాయని అంచనా వేస్తున్నారు. 'రెండు లీగ్ల విలీనంపై ఒకవేళ మేం అందరికి ఆమోదయోగ్యమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రాకపోతే విలీనప్రణాళిక 2018 - 19కి వాయిదా వేస్తాం' అని ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పారు.
కొత్త ఐడియా ప్రకారం పది జట్లతో నూతన లీగ్ ప్రారంభించాలని భావిస్తున్నాం. అందులో ప్రస్తుత ఎనిమిది ఐఎస్ఎల్ జట్లతోపాటు ఐ - లీగ్ క్లబ్లలో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి, రన్నరప్ కోల్ కతా జెయింట్స్ మొహున్ బగాన్ క్లబ్ లను కలుపాలని భావిస్తున్నాం. కానీ ఎఐఎఫ్ఎఫ్ 11 జట్లతో కొత్త లీగ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కోల్ కతా మరో జట్టు ఈస్ట్ బెంగాల్ కూడా బరిలో ఉండటమే ఎఐఎఫ్ఎఫ్ ప్రతిపాదనకు కారణం. సరికొత్త లీగ్లో ఎన్ని జట్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదని కుశాల్ దాస్ పేర్కొన్నారు.
డిమాండ్లు, ఐడియాలకు అనుగుణంగా సంప్రదాయ ఐ లీగ్ క్లబ్లు, కార్పొరేట్ లుక్తో కూడిన ఎనిమిది ఐఎస్ఎల్ ఫ్రాంచైసీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని ఎఐఎఫ్ఎఫ్ ప్రతిష్ఠాత్మక ప్రణాళికలో భాగంగా ఉంది. తమ ముందు ఎటువంటి షార్ట్ కట్లు లేవన్నాడు. అన్ని వర్గాలు, భాగస్వామ్య పక్షాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తమ ప్రణాళికకు సరైన నిర్వచనం చెప్తామని తెలిపారు. ఇందుకు కొంత గడువు అవసరమని ప్రతి ఒక్కరికీ తెలుసునని, దశల వారీగా ఎన్ని క్లబ్ లకు చోటు కల్పించగలమో ఇప్పటికిప్పుడు చెప్పలేమని ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ చెప్పాడు.
వారసత్వ ఐ - లీగ్ క్లబ్ జట్లపై తనకు గౌరవం ఉన్నదని.. కొత్త జట్ల చేరిక, నూతన లీగ్ ఆవిర్భావంపై ఏషియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి)తో కలిసి నిర్ణయిస్తామని, తద్వారా సమ్మిళిత లీగ్ రూపకల్పనపై సంత్రుప్తికరమైన బాటలో ముందుకెళ్తామన్నాడు. ఎఎఫ్ సి కేవలం మార్గదర్శకాలు మాత్రమే ఇస్తుందని, తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం ఎఐఎఫ్ఎఫ్ మాత్రమేనన్నాడు. ప్రస్తుతం క్లబ్లు, ఫ్రాంచైసీల ఆలోచనలు, అవసరాలు తీర్చేందుకు మధ్యంతర మార్గాన్వేషణపై ఎఐఎఫ్ఎఫ్ ద్రుష్టి సారించింది. విదేశీ ప్లేయర్లకు భాగస్వామ్యం కల్పించడం ఖర్చుతో కూడుకున్నపని కావడంతో పలు వివాదాస్పద అంశాలు ముందుకు వస్తాయని తెలిపాడు.
ఇండియా మాజీ కెప్టెన్ భాయిచుంగ్ భూటియా వంటి వారు ప్రస్తుత దేశీయ ఫుట్ బాల్ టోర్నీలకు కొత్తరూపునివ్వాలంటే ఏడు నెలల లీగ్ నిర్వహణ తప్పనిసరని తెలిపాడు. ప్రస్తుతం ఫుట్ బాల్ క్యాలెండర్ కు నిర్వచనం ఇవ్వడం క్లిష్టంగా ఉందని, తక్కువ గడువుతో కూడిన ఐ లీగ్, ఐఎస్ఎల్ నిర్వహణ వల్ల పలువురు ఆటగాళ్లు వాటికి దూరం అవుతున్నారన్నారు. కనుక ఏడు నెలల లీగ్ గా మారిస్తే ఆటలో సుస్థిరమైన ప్రగతి సాధించొచ్చన్నాడు. లెజెండరీ స్ట్రయికర్ ఐఎం విజయన్ సైతం పలు ఐ - లీగ్ క్లబ్ లకు కొత్త లీగ్ లో చోటు కల్పిస్తేనే అగ్రశ్రేణి ప్లేయర్లు ఆవిర్బవిస్తారని పేర్కొన్నాడు.