ముంబై: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఓ సలహా సూచించారు. ఐపీఎల్కు ఇంకా ఎంతో సమయం ఉంది, అప్పుడే పునరాగమనానికి తొందరపడొద్దని పాండ్యాకు జహీర్ సలహా ఇచ్చారు. గత కొంతకాలంగా వెన్ను గాయంతో సతమవుతున్న హార్దిక్ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో గతేడాది సెప్టెంబరు నుండి జట్టుకు దూరమైయ్యాడు. గాయం నుండి కోలుకుంటూ.. నెల క్రితమే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
టీమిండియాతో వన్డే సిరీస్.. తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్!!
తాజాగా జహీర్ ఖాన్ మాట్లాడుతూ... 'ఐపీఎల్కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా హార్దిక్ పాండ్యా 120 శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పాండ్యాకు ఇప్పుడు ఓపిక అవసరం' అని అన్నారు.
'సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాలి. తగినంత సమయం తీసుకోవాలి. రీఎంట్రీ కోసం తొందరపాటు పనికిరాదు. పునరాగమనంలో సుదీర్ఘ ప్రయోజనాలు కలిగిఉండాలి. ఇటీవల పాండ్యాతో మాట్లాడా. కొన్ని విషయాలు అతనికి చెప్పా. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతోనే ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి' అని జహీర్ పేర్కొన్నారు.
'న్యూజిలాండ్ను సొంతగడ్డపై టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసి భారత్ సత్తాచాటింది. టీమిండియా 5-0తో విజయం సాధించడం ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం కివీస్ క్లిష్ట సమయంలో ఉంది. భారత్ను ఎదుర్కోవడానికి వారు మార్గాలు అన్వేషించాలి. ఇక వన్డే సిరీస్ కూడా కివీస్కు సవాలే. టీమిండియా ఇదే జోరుని కొనసాగిస్తూ వన్డే, టెస్టు మ్యాచ్లు ఆడాలి. జట్టును గాయాలు వేధిస్తున్నాయి. అయితే రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్ఠంగా ఉంది. దిగులు చెందాల్సిన అవసరం లేదు' అని జహీర్ చెప్పుకొచ్చారు.
జనవరి 14న ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు నెట్స్లో హార్దిక్ బంతులు విసిరాడు. ఆ సమయంలో భారత జట్టు కోచింగ్ బృందం పరీక్షించగా.. అతడు బౌలింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో న్యూజిలాండ్కు వెళ్లిన భారత్-ఎ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్, అతడి బృందం పర్యవేక్షణలో హార్దిక్ శిక్షణ పొందనున్నాడు.