ముంబై: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పేసర్ జహీర్ ఖాన్.. టీమిండియాలో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని చెప్పాడు. అయితే తన వారుసుడ్ని మాత్రం ఒక్కరినే సూచించాడు. అతడే ఉమేశ్ యాదవ్. సుదీర్ఘ కాలం భారత పేస్ను నడిపించిన జహీర్ ప్రస్తుత టీమ్ఇండియా పేసర్ల గురించి, తన వారసుడి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
'టీమ్ఇండియా పేసర్లకు వేగం చాలా ముఖ్యం. అయితే బౌలింగ్లో నియంత్రణ కూడా ఎంతో అవసరం. ముందు టీమ్ఇండియాకు స్థిరమైన పేస్ దళం కావాలి. ఈ క్రమంలో నాణ్యమైన పేసర్లు జట్టుకు లభిస్తారు. పేసర్లు ముందు తమను తాము విశ్వసించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలమని నమ్మితే కచ్చితంగా విజయం సాధిస్తారు' అని జహీర్ పేర్కొన్నాడు.
'ఉమేశ్ బౌలింగ్లో మంచి వేగం ఉంది. భారత పేస్ దళాన్ని నడిపించగల సత్తా అతడి సొంతం. అయితే.. ఉమేశ్ తనలోని నైపుణ్యాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించాలి. ఇంకా అతడు పూర్తి సామర్థ్యం మేరకు బౌలింగ్ చేయట్లేదు' అని చెప్పాడు.
రిటైరైపోవడంతో కుర్రాళ్లకు సలహాలిచ్చే అవకాశాన్ని కోల్పోయినట్లుగా తాను భావించట్లేదని జహీర్ అన్నాడు. 'మార్గనిర్దేశం చేయడమనేది నాకు సహజంగా వచ్చిన లక్షణం. ఎవరైనా సహాయం కోరి వన్తే కాదనను. బౌలింగ్ కోచ్గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించడంపై ఇంకా నిర్ణయించుకోలేదు. ఐతే ఏదో రూపంలో కచ్చితంగా ఆటకు దగ్గరగానే ఉంటా' అని చెప్పాడు.

మేటి బ్యాట్స్మన్ వికెట్ తీయడం ఎప్పుడూ కష్టమేనని.. వారికి బౌలింగ్ చేయడాన్ని తాను ఆస్వాదించేవాడినని జహీర్ చెప్పాడు. జహీర్ బౌలింగ్లో ఆడడం చాలా కష్టమని ఈ మధ్య సంగక్కర చెప్పడంపై స్పందిచాడు.
'అత్యుత్తమ స్థాయి క్రికెట్లో అత్యంత నిలకడ ప్రదర్శించిన ఆటగాడి నుంచి లభించిన గొప్ప అభినందన అది. ఇలాంటివి విన్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. ఓ మేటి బ్యాట్స్మన్.. అలా చూస్తూన్నాడని తెలియడం ఏ బౌలర్కైనా ఎంతో సంతృప్తిని ఇస్తుంది' అని తెలిపాడు.
కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వికెట్ ఏదంటే చెప్పడం చాలా కష్టమని జహీర్ అన్నాడు. 'అలా మేటి వికెట్ అంటూ ఏదీ లేదు. నేనేవి గుర్తుంచుకోను. అలా చేయడం చాలా కష్టం. వికెట్ కాదు గానీ.. బంతిని గొప్పగా రివర్స్ స్వింగ్ చేసిన కొన్ని స్పెల్స్ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి' అని జహీర్ వివరించాడు. తాను అందరి కెప్టెన్సీల్లో ఆటను ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు.