ప్రతిసారీ నేను ఆపేవాడినని:
మంగళవారం గౌతమ్ గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో యువరాజ్ సింగ్తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోకు ఓ సరదా కామెంట్ పెట్టాడు. 'థాంక్ గాడ్. మన ఇద్దరి మొహాల్లో చిరునవ్వులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రజలంతా.. నేనేదో కొట్లాడటానికి వెళ్తుంటే నువ్వు నన్ను వెనకనుండి ఆపుతున్నట్టు పొరబడేవారు' అని పోస్టు చేశాడు. ఈ పోస్టుపై స్పందించిన యువీ.. అంతే సరదాగా గౌతీని ట్రోల్ చేశాడు. 'నువ్వు మైదానంలో గొడవకు సిద్ధమైన ప్రతిసారీ నేను ఇలాగే చేయాల్సి వచ్చేది' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఫాన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
సై అంటే సై అనేలా:
గౌతమ్ గంభీర్ భారత జట్టులో ఆడే రోజుల్లో తన బ్యాటింగ్తో అదరగొట్టడమే కాకుండా అప్పుడప్పుడు దూకుడుగా ఉంటూ ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బుదలిచ్చేవాడు. ఒక్కోసారి తన బ్యాటుతో, మరోసారి తన నోటితో అవతలి వారికి గట్టి సమాధానం ఇచ్చేవాడు. ఎవరు కవ్వించినా ఊరుకునేవాడు. ఒకసారి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో సై అంటే సై అనేలా కనిపించాడు. దీంతో అప్పటి నుంచీ వారిద్దరి మధ్య అప్పుడప్పుడు మాటలతూటాలు పేలుతుంటాయి. అలా గంభీర్ ఒక్కోసారి తన ప్రశాంతత కోల్పోయేవాడనే ఉద్దేశంలో యువరాజ్ సింగ్ సరదాగా కామెంట్ చేశాడు.
రెండుసార్లు ప్రపంచకప్లు అందించారు:
గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్లు భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. 2007 నుంచి 2011 వరకు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరూ భారత్ రెండుసార్లు ప్రపంచకప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాక్తో తలపడిన వేళ గంభీర్ (75) పరుగులు సాధించగా.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగులు చేశాడు. దీంతో ఆ రెండు ఫైనల్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ గౌతీ సాధించాడు. మరోవైపు యువరాజ్ 2007లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది జట్టును ఫైనల్కు తీసుకెళ్లగా.. 2011లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అయితే 2011 తర్వాత ఈ ఇద్దరి కెరీర్ గాడితప్పింది.
ఎంపీగా గంభీర్:
అంతర్జాతీయ కెరీర్లో గౌతమ్ గంభీర్ 58 టెస్టుల్లో, 147 వన్డేల్లో, 37 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4154, వన్డేల్లో 5238, టీ20ల్లో 932 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి గౌతీ 20 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం గంభీర్ ఢిల్లీ ఎంపీగా ఉన్నాడు. అప్పుడప్పుడు కామెంటరీ కూడా చెపుతున్నాడు. మరోవైపు యువరాజ్ సింగ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 1900, వన్డేల్లో 8701, టీ20ల్లో 1177 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి యువరాజ్ 17 సెంచరీలు చేశాడు.