అనుభవం లేని ఆటగాళ్లకు చోటు:
మంగళవారం ఒక ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్తో కలిసి యువరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యువీ పలు అంశాలపై మాట్లాడాడు. 'ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు యాజమాన్యం అవలంభించిన విధానం పూర్తిగా తప్పు అని నా అభిప్రాయం. మిడిల్ ఆర్డర్లో అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. టాప్ ఆర్డర్కు అనుగుణంగా మిడిలార్డర్లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయింది' అని అన్నాడు.
రాయుడిని పక్కకు పెట్టడం తప్పు
'అనుభవజ్ఞడైన అంబటి రాయుడిని పక్కన పెట్టారు. ఆల్రౌండర్ అన్న పేరుతో విజయ్ శంకర్ను జట్టులోకి తీసుకున్నారు. శంకర్ గాయపడ్డా రాయుడిని తీసుకోకుండా రిషబ్ పంత్ వైపు మొగ్గుచూపారు. శంకర్, పంత్ ప్రతిభను నేను తక్కువ చేయడం లేదు. వారికి కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. సెమీ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ల్లో రాయుడు అనుభవం జట్టుకు కచ్చితంగా పనికొచ్చేది' అని యువరాజ్ అబిప్రాయడ్డాడు.
సరైన ప్రణాళికలు తీసుకోలేదు:
'టోర్నీలో అప్పటివరకు ఆడని దినేష్ కార్తీక్ను జరిగిన కివీస్తో సెమీస్లో ఆడించారు. కీలక ఎంఎస్ ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్కు దింపి తప్పు చేశారు. ఆ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఫామ్ మీదున్నారు. ఈజీగా కప్ గెలుస్తామనుకున్నారు. కానీ.. ఫలితం వేరేలా వచ్చింది. జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలు తీసుకోవడంలో విఫలమైంది' అని యువీ చెప్పుకొచ్చాడు.
జూన్లో క్రికెట్కు వీడ్కోలు:
సిక్సర్ల కింగ్ యువరాజ్సింగ్ ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున యువరాజ్ 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. తన చివరి వన్డే మ్యాచ్ను 2017 జూన్ 30న వెస్టిండీస్తో ఆడాడు. తాజాగా యువీ తన పుట్టినరోజు వేడుకలను సహచర ఆటగాళ్లతో జరుపుకున్నాడు. యో-యో టెస్ట్ కారణంగానే నా కారీర్ నాశనం అయింది అని యువీ గతంలో అన్నాడు.