
హైదరాబాద్: గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపినివ్వకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ బలగాలు శ్రమిస్తున్నాయి. తెలంగాణ భారీ వర్షాల నుంచి త్వరగా బయటపడాలని చాలా మంది ప్రజలు, ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ట్విటర్ వేదికగా స్పందించాడు.
'తెలంగాణలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పెద్ద మొత్తంలో నష్టమేమీ జరగలేదు. కష్ట కాలంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారు. వరద ప్రభావంతో కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరణించిన వారికి, బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలం నుంచి తెలంగాణ త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరంతా సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా' అని యువరాజ్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కుంభవృష్టి సృష్టించింది. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయితే అస్తవ్యస్తమైంది. గత 33 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో తీవ్ర స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపినివ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు చేతికొచ్చిన పంటలు భారీ స్థాయిలో నాశనమయ్యాయి.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ను భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. కెరీర్ చరమాంకంలో మాత్రం ఊహించని అవమానాలు ఎదుర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్లో 362 పరుగులు, 15 వికెట్లు పడగొట్టిన యువరాజ్ సింగ్.. క్లిష్ట సమయాల్లోనూ సాహసోపేతంగా పోరాడి టీమిండియాకి విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ ఆ వరల్డ్కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడిన యువీ.. కొన్నిరోజులు ఆటకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటిలా ఆడలేకపోవడంతో 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకలేదు. దాంతో ఆ టోర్నీ జరుగుతుండగానే యువీ కెరీర్కి గుడ్బై చెప్పేశాడు.
భారత్ తరఫున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 1900 పరుగులు చేసిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
RCB vs KXIP: ఆర్సీబీ తరఫున 200వ మ్యాచ్.. విరాట్ కోహ్లీ డ్యాన్స్!!