
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో యువరాజ్ సింగ్ టోరంటో నేషనల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం టోరంటో నేషనల్స్-ఎడ్మాంటన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుణుడు అంతరాయం కలిగించడంతో అంఫైర్లు కాసేపు మ్యాచ్ని నిలిపివేశారు. ఈ సమయంలో ఎడ్మాంటన్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కట్టింగ్ను న్యూస్ ప్రెజంటర్ ఎరన్ హోలాండ్ ఇంటర్యూ చేస్తున్నారు. అదే సమయంలో యువరాజ్ వారిద్దరి మధ్యలోకి వచ్చి అంతరాయం కలిగించాడు.
అంతేకాదు "మీ పెళ్లి ఎప్పుడు?" అంటూ వారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. దీనికి ఒక్కసారిగా పగలబడి నవ్విన హోలాండ్ సమాధానం ఇచ్చేలోపే యువీ అక్కడ్నుంచి జారుకునే యత్నం చేశాడు. కాగా, వీరిద్దరూ గత నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కానున్నారు.
ఈ మ్యాచ్లో 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడ్మాంటన్ రాయల్స్ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెన్ కటింగ్ 43 పరుగులతో అజేయంగా నిలవగా.. షాదబ్ ఖాన్ 36 పరుగులతో ఫరవాలేదనిపించాడు.
అనంతరం ఎడ్మాంటన్ రాయల్స్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య చేధనలో నాలుగో స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్ తనదైన శైలిలో విజృంభించాడు. ఎడ్మాంటన్ తరఫున ఆడుతున్న పాక్ లెగ్ స్సిన్నర్ షాదబ్ ఖాన్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా బాదిన సిక్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.
దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ మ్యాచ్లో టోరంటో నేషనల్స్ జట్టు రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టొరెంటో నేషనల్స్ జట్టుని కెప్టెన్ యువరాజ్ సింగ్-హెన్రిచ్ క్లాసెన్లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 56 పరుగులు జోడించారు.
అనంతరం జట్టు స్కోరు 85 పరుగుల వద్ద యువీ ఔట్ కాగా, మరో మూడు పరుగుల వ్యవధిలో కీరన్ పొలార్డ్(2) పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి టొరెంటో నేషనల్స్ 125 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మన్ప్రీత్ గోనీ 12 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.
చివర్లో మాంట్ఫోర్ట్-సల్మాన్ నజార్లు దూకుడుగా ఆడటంతో యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టోరంటో నేషనల్స్ 17.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఎడ్మాంటన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 42 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.