హైదరాబాద్: డోప్ టెస్టులో విఫలమై ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న టీమిండియా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. విజయ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన బరోడా జట్టులోకి పఠాన్ని ఎంపిక చేసినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది.
కొన్నిరోజుల క్రితమే బరోడా జట్టు ఎంపిక పూర్తి అయినప్పటికీ, పఠాన్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో పఠాన్ ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వాలని బీసీసీఐ కోరాడు. ఇందుకు బీసీసీఐ సైతం పఠాన్కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.
వేరే లీగ్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బరోడా కూడా సానుకూలంగా స్పందించి పఠాన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది డోప్ టెస్టులో విఫలం కావడంతో పఠాన్పై ఆగస్టు 15, 2017 నుంచి జనవరి 14, 2018 వరకు దేశవాళీ టోర్నీ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి కూడా యూసఫ్ పఠాన్ దూరమయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జరగనుండటంతో ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశంతో పఠాన్ ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
అయితే, ఇప్పుడు అనూహ్యంగా బరోడానే విజయ్ హాజారే ట్రోఫీలో పఠాన్ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో యూసఫ్ పఠాన్ని రూ. 1.9 కోట్లకి సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.