|
కోహ్లీని ఢీకొనేలా కనిపించిన టిమ్ పైన్
ఇక, ఆటలో నాలుగోరోజైన సోమవారం ఓవర్నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 174/4తో నిలిచిన దశలో పరుగు కోసం నాన్స్ట్రైక్ ఎండ్వైపు వచ్చిన టిమ్ పైన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దాదాపు ఢీకొనేలా కనిపించాడు. అతని ప్రయత్నాన్ని ముందే పసిగట్టిన కోహ్లీ కదలకుండా అలానే నిల్చున్నాడు.
కోహ్లీకి దగ్గరగా వెళ్లిన టిమ్ పైన్
మరోవైపు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా అతనికి చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఇద్దరు ఆటగాళ్లు అలా ఒకరినొకరు కవ్వించే తరహాలో తాకేలా ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ కలగజేసుకోవాల్సి వచ్చింది. అంపైర్కి వివరణ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ కోపంగానే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
|
రెండో ఇన్నింగ్స్లో 243 ఆలౌట్
ఓవర్నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన తొలి ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
|
13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్
ఆ తర్వాత కొద్ది సేపటికే పుజారా (4) కూడా హేజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అనంతరం మురళీ విజయ్-కోహ్లీల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరి జోడి 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు.
|
నాథన్ లియాన్ బౌలింగ్లో కోహ్లీ ఔట్
నాథన్ లియాన్ బౌలింగ్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఔటై పెవిలియన్కు చేరిన తర్వాత మరోసారి ఆసీస్ కెప్టెన్ టిమ్ పేన్ స్లెడ్జింగ్ చేశాడు. బ్యాటింగ్కు సిద్ధమైన ఓపెనర్ మురళీ విజయ్ను పేన్ స్లెడ్జింగ్ చేయడం మైక్రోఫోన్లో వినిపించింది. "మురళీ నాకు తెలుసు.. అతడు మీ కెప్టెన్ అయినా కూడా.. అంత కఠినంగా ఉండటం మీకు నచ్చదు కదా" అని కోహ్లీ గురించి పేన్ అన్నాడు.
|
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 112/5
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నిలకడగా ఆడుతోన్న మురళీ విజయ్ని బౌల్డ్ చేసి భారత్ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఇదిలా ఉంటే, 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(24), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.