కెప్టెన్ కావడానికి యువరాజ్ అర్హుడు:
యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ... 'వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ మాట్లాడిన వీడియోలను చూశాను. వీడియోలో వారు మాట్లాడిన ప్రతి అంశాన్ని విన్నాను. ప్రతి ఒక్కరూ ధోనీ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒకటి నెగటివ్గా మాట్లాడారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ఎవరూ చెడుగా మాట్లాడలేదు. గంగూలీ సారథ్య బాధ్యతలు అందుకునే సమయానికి భారత జట్టు నంబర్ ఏడులో ఉండేది. యువరాజ్, కైఫ్, ఖాన్, హర్భజన్ , సెహ్వాగ్, గంభీర్ తదితర యువ క్రికెటర్లతో అప్పట్లో జట్టుని దాదా సిద్ధం చేసుకున్నాడు. గంగూలీ తర్వాత యువీ కెప్టెన్ కావాల్సింది. కానీ.. విధి ధోనీని కెప్టెన్ని చేసింది' అని యోగరాజ్ సింగ్ చెప్పారు.
యువీకి వెన్నుపోటు:
యువరాజ్ సింగ్ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని.. అందులో ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారని యోగరాజ్ మండిపడ్డారు. ‘ధోనీ, కోహ్లీలతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేది. చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు. నిజంగా ఇది అతడిని ఎంతగానో బాధించింది. ఇటీవల కోచ్ రవిశాస్త్రి కలిసాడు. నాతో సెల్ఫీ కూడా దిగాడు. నేను అతనితో దిగ్గజ ఆటగాళ్ల వీడ్కోలు విషయాన్ని ప్రస్తావించా. కెరీర్లో వారి ప్రదర్శన ఆధారంగా క్రికెటర్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని సూచించా' అని అన్నారు.
అనూహ్యంగా ధోనీకి అవకాశం:
ఎంఎస్ ధోనీ కంటే ముందే భారత్ జట్టులోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ జట్టులోకి వచ్చే సమయానికి యువీ కీలక ప్లేయర్. ఇక రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఇద్దరు మంచి స్థానానికి చేరుకున్నారు. సీనియర్లు ఆడకపోవడంతో.. 2007లో టీ20 ప్రపంచకప్ కోసం ధోనీ తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. యువీ కూడా కెప్టెన్సీ రేసులో నిలిచాడు కానీ.. అనూహ్యంగా ధోనీకి ఆ అవకాశం దక్కింది. మహీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు టోర్నీలలో యువీ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
6 బంతులకు 6 సిక్స్లు:
ధోనీ సారథ్యంలో భారత్ సాధించిన రెండు ప్రపంచకప్లలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్ షోతో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు. అనంతరం క్యాన్సర్ బారిన పడి అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. చికిత్స అనంతరం యువీ కెరీర్ అంతగా సాగలేదు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.
304 వన్డేలు.. 8701 పరుగులు
2019 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో.. గత ఏడాది టోర్నీ జరుగుతున్న సమయంలోనే యువీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1,900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8,701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1,177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.