కుశాల్ పెరీరా ఒంటరి పోరాటం
దక్షిణాఫ్రికాపై శ్రీలంక బ్యాట్స్మెన్ కుశాల్ పెరీరా (153 నాటౌట్) టెస్టు క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. సపారీలు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 303 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం లక్ష్య చేధనలో దిగిన లంక 110 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డిసిల్వా (48)తో కలిసి 96 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే లంక నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా మాత్రం ఆఖరి బ్యాట్స్మెన్ ఫెర్నాండో(6 నాటౌట్)ను కాపాడుకుంటూ పదో వికెట్కు 78 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు.
యాషెస్లో బెన్ స్టోక్స్ అద్భుతం
ఈ ఏడాది యాషెస్ సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 179 పరుగులకు ఆలౌట్గా ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 246 పరుగులు చేసింది. అనంతరం 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 286 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అంతా ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని అనుకున్నారు. ఈ సమయంలో లీచ్ (1 నాటౌట్)తో కలిసి బెన్స్టోక్స్ చేసిన ఒంటరి పోరాటం టెస్టు క్రికెట్ను అభిమానులు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. ఆఖరి వికెట్కు అజేయంగా 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్కు విజయాన్నందించాడు.
ప్రపంచకప్లో కివీస్తో తొలి సెమీఫైనల్
లీగ్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఈ మ్యాచ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం ముఫ్పై నిమిషాల్లో భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. విజయం కోసం రవీంద్ర జడేజా పోరాడిన తీరు అందరి మనసులు గెలుచుకుంది. జట్టు స్కోరు 92/6 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన జడేజా చివరి వరకు పోరాడాడు. ఒకవైపు ధోని, మరొకవైపు జడేజా నిలకడగా ఆడుటంతో చివర్లో విజయ సమీకరణం 13 బంతుల్లో 31 పరుగులుగా మారిపోయింది. జడేజా, ధోనీ క్రీజులో ఉండటంతో టీమిండియా విజయం సాధిస్తుందని అనుకున్నారు. అయితే, స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔటవ్వడంతో ప్రపంచకప్లో టీమిండియా ఓడిపోయింది.
కివీస్పై కార్లోస్ బ్రాత్వైట్ విధ్వంసకర ఇన్నింగ్స్
ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్కప్లో అందరికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ కార్లోస్ బ్రాత్వైట్దే. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే న్యూజిలాండ్పై తప్పక విజయం సాధించాలి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 291 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండిస్ జట్టులో కార్లోస్ బ్రాత్వైట్ (101) సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వికెట్గా వెనుదిరిగడంతో ఈ మ్యాచ్లో విండిస్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మైదానంలోనే మోకాళ్లపై నిస్సహాయంగా కూలబడ్డాడు. ఇది గమనించిన విలియమ్సన్, రాస్ టేలర్ అతడి దగ్గరికి వచ్చి ఓదార్చారు. ఈ సన్నివేశం అప్పట్లో అందరి మనసులను గెలుచుకుంది.
ఐపీఎల్లో చెలరేగిన పాండ్యా
ఐపీఎల్ 12వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్పై హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఈ ఏడాది హైలెట్గా నిలిచింది. ఆండ్రూ రసెల్ (80 నాటౌట్), శుభ్మన్ గిల్ (76), క్రిస్ లిన్ (54) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 232 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ 8.2 ఓవర్లలో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో కేకేఆర్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్యా 34 బంతుల్లోనే తొమ్మిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 91 పరుగులు చేశాడు. అయితే, చివర్లో ఔటవ్వడంతో కేకేఆర్ విజయం సాధించింది.