మిచెల్ మార్ష్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా మిచెల్ మార్ష్ మాట్లాడుతూ "అవును, నన్ను ఎక్కువ శాతం మంది ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు. ఆస్ట్రేలియన్లు క్రికెట్ పట్ల మక్కువను కలిగి ఉంటారు. క్రికెట్ను ప్రేమిస్తారు. వారు ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన ఇస్తేనే ఆటగాళ్లను గౌరవిస్తారు. తరచు జట్టుకు దూరమవుతూ రావడంతో నన్ను కచ్చితంగా మా అభిమానులు అసహ్యించుకునే ఉంటారు(నవ్వుతూ)" అని చెప్పాడు.
పలు రకాల సమస్యలు
"పలు రకాల సమస్యలు నన్ను క్రికెట్కు దూరంగా ఉంచాయి. టెస్టుల్లో నాకు చాలా ఎక్కువ అవకాశాలే వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే, ఇప్పుడు నాకు తగినంత గౌరవం లభిస్తుందనే అనుకుంటున్నా. తిరిగి ఆస్ట్రేలియా జట్టుకు క్రికెట్ను ఆడటం సంతోషంగా ఉంది. బ్యాగీ గ్రీన్ క్యాప్ను ధరించి ఆడటాన్ని ప్రేమిస్తా" అని మార్ష్ తెలిపాడు.
అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా
"నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా. గత ఆరు నెలలుగా నా లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకున్నా. ఏది పడితే అది తినడం లేదు. నేను తింటే నా శరీరం తేలికగా బరువు పెరగుతుంది. నా తల్లి కూడా నాకు ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అయితే, గత ఆరు నెలల్లో నేను రోస్ట్స్ను తక్కువగా తీసుకున్నా. వంటలో ఎలాంటి రహస్యం లేదు" అని మిచెల్ మార్ష పేర్కొన్నాడు.
నాలుగు వికెట్లు తీసిన మిచెల్ మార్ష్
యాషెస్ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టులో తొలి రోజు ఇంగ్లాండ్ తడబడింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ (4/35) విజృంభించడంతో గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 271/8 స్కోరు చేసింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 205 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, జోస్ బట్లర్ (64) ఒంటరి పోరాటంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే ఆలౌట్ కాకుండా చూశాడు.