కోహ్లీకి గాయం
మొహ్మద్ షమీ విసిరిన బంతి విరాట్ కోహ్లీ పక్కటెముకలకు బలంగా తగిలిందని వస్తున్న వార్తలు పుకార్లే ఓ షోలో పాల్గొన్న విక్రాంత్ గుప్తా చెప్పారు. ఒకవేళ కోహ్లీకి గాయం అన్నది నిజమైతే మాత్రం భారత జట్టుకు పెద్ద దెబ్బ పడినట్లే. టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత క్రికెటర్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీ, మహ్మద్ సిరాజ్లు నెట్స్లో బౌలింగ్ చేయగా.. కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ షమీ బౌలింగ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. ఓ బౌన్సర్ బంతిని అంచనా వేయలేకపోయాడు. దాంతో వేగంగా వచ్చిన బంతి కోహ్లీ పక్కటెముకలకి బలంగా తాకినట్లు తెలుస్తోంది.
కోలుకోవడానికి 3-6 వారాలు సమయం
విరాట్ కోహ్లీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాలంటే కనీసం 3-6 వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. విరాట్ గాయంపై వస్తున్న వార్తలపై బీసీసీఐ ఏదైనా ప్రకటన ఇస్తుందా లేదా చూడాలి. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 22 వరకూ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. విరాట్ కోహ్లీ ఒకవేళ ఈ మ్యాచ్లకి దూరమైతే.. అతని స్థానంలో అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఏదేమైనా అధికారిక సమాచారం వచ్చేవరకు అసలు విషయం ఏంటో తెలియదు.
గురువారం నుంచి అందరూ కలిసి ప్రాక్టీస్
ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్స్.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. అనంతరం ముంబైలో రెండు వారాల క్వారంటైన్ తర్వాత భారత ఆటగాళ్లు జూన్ 3న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. ఆపై మూడు రోజులు ఒక్కో ప్లేయర్ సాధన చేశారు. గురువారం నుంచి అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్ హోటల్లో కోహ్లీసేన బస చేస్తున్నది.