న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా రాణిస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ భారత్ సొంతమవుతుందని మాజీ క్రికెటర్ సబా కరీం తెలిపాడు. బుమ్రా రాణించడంపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. ఇక టీమిండియా పేస్ విభాగంలో బుమ్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఈ యార్కర్ల కింగ్ 83 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాకుండా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి జట్లపై టెస్ట్ ఫార్మాట్లో 5 వికెట్లు(ఒకే ఇన్నింగ్స్) తీసిన తొలి ఆసియా బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడటంతో టీమిండియా అప్ కమింగ్ డబ్ల్యూటీసీ ఫైనల్పై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఇండియా న్యూస్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సబా కరీం మాట్లాడుతూ... జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ల్లో 400 వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందన్న వెస్టిండీస్ దిగ్గజం కర్ట్ అంబ్రోస్ వ్యాఖ్యలతో సబా కరీం ఏకీ భవించాడు.
'బుమ్రా గురించి కర్ట్లీ అంబ్రోస్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. మూడు, నాలుగు ఐపీఎల్ మ్యాచ్లు చూశాను. బుమ్రా మంచి ఫాంలో ఉన్నాడు అనిపించింది. తనొక ప్రత్యేకమైన బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ప్రధాన పేసర్ తను. షార్ట్ బంతులు సంధించి వికెట్లు పడగొట్టగలడు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడనే నమ్మకం ఉంది. తను ఫాంలో ఉంటే భారత్కు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.
మూడు ఫార్మాట్లలో మెరుగ్గా రాణిస్తున్న ఏకైక భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతని ఒత్తిడి అధిగమించడం చాలా సులువు. అదే విధంగా సహచర పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలతో తన రోల్ ఏంటో తెలుసు. ఈ ముగ్గురు రాణించడం భారత జట్టుకు కీలకం'అని మాజీ సెలక్టర్ సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఇక జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు 24 సభ్యులతో కూడిన భారత జంబో జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.