జట్టులో పుజారా అంతర్భాగం
తాజాగా పీటీఐతో సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'భారత్ కోసం చెతేశ్వర్ పుజారా ఎంతో సాధించాడు. అందుకు పుజారాను ప్రశంసించాలి. టెస్ట్ ఫార్మాట్లో ప్రతిసారీ స్ట్రైక్రేట్ ప్రధానం కావు. టెస్టుల్లో విజయాలు అందుకోవాలంటే భిన్నమైన ఆటగాళ్లు, ప్రణాళికలు జట్టుకు అవసరం. చేతిలోని ఐదు వేళ్లలాగే ఇదీ. ప్రతి వేలికీ ఓక్కో పాత్ర ఉంటుంది.
అదే విధంగా జట్టులో పుజారా అంతర్భాగం. అతడి ప్రతి ఇన్నింగ్స్నూ విశ్లేషించడం మానేసి.. దేశం కోసం సాధించినవాటికి మెచ్చుకోవాలి. పుజారా టెక్నిక్, రొటేషన్ గురించి నిత్యం ప్రశ్నించేవాళ్లు.. అతడిలా అత్యున్నత స్థాయి క్రికెట్ కనీసం ఆడి ఉండరు' అని సచిన్ అన్నారు.
పుజారా ఎప్పటికీ అర్థమవ్వడు
'టీ20 క్రికెట్ కారణంగా వీక్షకుల దృక్పథం మారిపోయింది. స్టాండ్స్లోకి బంతిని పంపిస్తే చాలనుకుంటున్నారు. ఈ టీ20 క్రికెట్ యుగంలో భారీ షాట్లు ఆడితే చాలు. వాళ్లే గొప్ప ఆటగాడని అనుకుంటున్నారు. అలాంటి వారికి చెతేశ్వర్ పుజారా ఎప్పటికీ అర్థమవ్వడు. వారికి మంచి టెస్టు ఆటగాళ్లు అక్కర్లేదు. సుదీర్ఘ ఫార్మాట్లో కేవలం బాదడం మాత్రమే కాదు. దానికి తోడుగా అదనపు నైపుణ్యాలు అవసరం. మ్యాచ్, పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో కఠిన పరిస్థితుల్లో పుజారా ఆడాడు. ఎన్ని దెబ్బలు తగిలినా.. క్రీజులో నిలబడ్డాడు' అని సచిన్ తెలిపారు.
స్ట్రైక్రేట్ పెంచేందుకు పంత్, జడేజా ఉన్నారు
'జట్టులో స్ట్రైక్రేట్ పెంచేందుకు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు వారు స్ట్రైక్రేట్ పెంచగలరు. భారీ షాట్లతో అలరించగలరు. ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయాలంటే మాత్రం ప్రత్యేకమైన ప్రణాళికలు, దార్శనికత, వ్యూహాలు అవసరం. అందుకోసం చెతేశ్వర్ పుజారా అవసరం' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు. పుజారా భారత్ తరఫున 85 టెస్టులు ఆడి.. 6244 రన్స్ చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 నాటౌట్.
కోహ్లీసేన ప్రాక్టీస్
ఛాంపియన్షిప్ ఫైనల్కు కోహ్లీసేన వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. సోమవారం వరకు అంతర్గత మ్యాచ్ ఆడిన భారత్ మంగళవారం నెట్స్లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ దేహానికి దూరంగా వెళ్లే బంతులు, షార్ట్పిచ్ బంతులను ప్రత్యేకంగా సాధన చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం చెమటోడ్చారు. ఇంగ్లండ్లో బంతులు స్వింగవుతాయని తెలిసిందే. వేగంగా వచ్చే బంతులను డ్రైవ్ చేయాలని భావిస్తుంటారు. ఆ క్రమంలో బంతులు బ్యాటు అంచులకు తగిలి స్లిప్లో లేదా వికెట్ కీపర్కు చిక్కుతుంటారు. అందుకే అలాంటి బంతులను భారత ఆటగాళ్లు సాధన చేశారు.