
హైదరాబాద్: టీమిండియాలో టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పిన ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. పరిమిత ఓవర్ల సిరీస్లలో మాత్రమే పరవాలేదనిపించిన టీమిండియా టెస్టుల్లో నిరాశనే మిగిల్చింది. ఇలా టెస్టుల్లో వైఫల్యానికి ప్రధాన కారణం తుది జట్టును సరిగా ఎంచుకోలేకపోవడమే. ఈ క్రమంలోనే ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సాహా.. దినేశ్ కార్తీక్.. రిషబ్ పంత్లను జట్టు నమ్ముకుంది.
ఇలా కీపర్గా పంత్తో ముగించిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి టెస్టు పంత్.. కేఎల్ రాహుల్లు సెంచరీతో ఇరగదీశారు. ఇలా చివరి టెస్టులో సెంచరీ బాదిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ని ప్రశంసించిన సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహాపై సెటైర్లు వర్షం కురుస్తోంది. భుజం గాయం, సర్జరీ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి క్రికెట్కి సాహా దూరంగా ఉంటున్నాడు.
దీంతో.. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం సాహా స్థానంలో దినేశ్ కార్తీక్ని రెగ్యులర్ వికెట్ కీపర్గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. ప్రత్యామ్నాయ కీపర్గా రిషబ్ పంత్ని ఎంపిక చేశారు. ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల్లో కీపర్గా ఫర్వాలేదనిపించిన దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో.. చివరి మూడు టెస్టుల్లో రిషబ్ పంత్కి జట్టులో అవకాశం ఇవ్వగా.. మంగళవారం ముగిసిన ఓవల్ టెస్టులో పంత్ (114)146 బంతుల్లో 15ఫోర్లు, 4సిక్సులతో కలిపి మెరుపు సెంచరీ బాదేశాడు.
కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించిన రిషబ్ పంత్ని ప్రశంసిస్తూ సాహా ట్వీట్ చేయగా.. దానిపై అభిమానులు సెటైరికల్గా స్పందిస్తున్నారు. అక్టోబరు 4 నుంచి వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత డిసెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టులు ఆడనుంది. గాయానికి ఇటీవల సర్జరీ చేసుకోవడంతో ఈ ఏడాది సాహా మైదానంలోకి దిగే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో.. మరోసారి రిషబ్ పంత్కే ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.