భవిష్యత్తులో ఇద్దరం కలసి ఆడుతాం: దినేష్ కార్తీక్

భవిష్యత్తులో రిషభ్ పంత్, నేను కలిసి ఆడుతాం అని ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ మే 30 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ప్రధానంగా నాలుగో స్థానంలో రేసులో ఉన్న అంబటి రాయుడు.. ధోనికి బ్యాకప్ కీపర్గా ముందంజలో ఉన్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్లకు జట్టులో చోటు దక్కలేదు. పంత్ను కాదని.. అనుభవం, ఒత్తిడిని జయించే సామర్థ్యం ఉన్న సీనియర్ దినేష్ కార్తీక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. దీంతో అభిమానులతో సహా కొందరు మాజీలు కూడా సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ స్పందించారు.

పంత్ ఎంపికైతే నిరాశ చెందేవాడిని:
'జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుండి ప్రపంచకప్పై దృష్టి సారించా. అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే అవకాశం దక్కుతుందని భావించా. ఈ క్రమంలోనే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. జట్టులో అందరికి అవకాశం దక్కదు.. ఇది ఆటలో భాగం. ఒకవేళ పంత్ ఎంపికైతే నేను నిరాశ చెందేవాడిని. నేను ఎంపికయ్యా కాబట్టి అతను బాధపడుతున్నాడు' అని కార్తీక్ అన్నారు.

భవిష్యత్తులో జరుగుతుంది:
'రిషబ్ పంత్ దూకుడైన ఆటగాడు. చాలా రోజులు క్రికెట్ ఆడుతాడు. ప్రస్తుతం ధోనితో కలిసి నేను ఆడుతున్నాను. అలాగే నేను.. పంత్తో కలిసి ఆడుతా, డ్రెస్సింగ్ రూం పంచుకుంటా. భవిష్యత్తులో ఇది జరుగుతుంది. ఇద్దరం కలసి ఆడుతాం' అని కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేసారు.

స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపిక:
ప్రపంచకప్ కోసం అంబటి రాయుడు, పంత్, నవదీప్ సైనీలు స్టాండ్బై ఆటగాళ్లుగా ఉన్నారు. బ్యాట్స్మన్ జాబితాలో రిషబ్ పంత్ మొదటి స్టాండ్ బై కాగా.. అంబటి రాయుడు రెండో స్టాండ్ బైగా ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో నవదీప్ షైనీ ఒక్కడే. ప్రస్తుత జట్టులో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్ విమానం ఎక్కనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications