హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాన్ని ఆ జట్టు సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ సమర్థించాడు. తాజాగా, పాకిస్థాన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో భారత్ చేతిలో ఓటమిపై హఫీజ్ స్పందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భగా హఫీజ్ మాట్లాడుతూ "టాస్ నిర్ణయం మేం జట్టుగా కలిసి తీసుకున్నది. మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమి చవి చూశాం. ఈ పరాజయంలో జట్టుగా అందరి బాధ్యత ఉంది. ఒక్క సర్ఫరాజ్నే నిందించడం సరికాదు. మా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి" అని అన్నాడు.
"భారత్ మ్యాచ్ అనంతరం మాకు తగినంత సమయం దొరికింది. నూతనోత్సాహంతో మిగతా మ్యాచ్లను గెలుస్తాం" అని హఫీజ్ అన్నాడు. భారత్తో మ్యాచ్కు ముందు పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని ముందుగానే సర్ఫరాజ్కు సూచించిన సంగతి తెలిసిందే.
అయితే, సర్ఫరాజ్... ఇమ్రాన్ ఖాన్ మాటను లెక్క చేయకుండా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయమే పాక్ విజయాలను దెబ్బతీసిందని, చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో భారత్ చేసిన తప్పునే ఇప్పుడు పాక్ చేసిందని అటు అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ను 40 ఓవర్లకు కుదించారు.
దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.