సెమీస్లకు వర్షం ముప్పు:
సిడ్నీ క్రికెట్ మైదానంలో మొదటగా భారత్-ఇంగ్లాండ్ తలపడనుండగా.. ఆ తర్వాత అదే వేదికపై దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు పోటీ పడనున్నాయి. అయితే సెమీస్ మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచివుంది. వాతావరణ సమాచారం ప్రకారం.. సిడ్నీలో గురువారం 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. భారీగా వర్షం పడకున్నా.. మోస్తరు జల్లులు కురుస్తాయట. మోస్తరు జల్లులు మ్యాచ్లకు ఆటకం కలిగించవచ్చని సమాచారం. ఒకవేళ వర్షం అడ్డంకిగా మారితే.. భారత్, దక్షిణాఫ్రికా జట్లకు లాభం చేకూరనుంది.
ఫైనల్లో భారత్తో దక్షిణాఫ్రికా:
వర్షం అడ్డంకిగా మారితే భారత్, దక్షిణాఫ్రికా జట్లు గ్రూప్ దశలో టాప్లో ఉన్నందున నేరుగా ఫైనల్ చేరతాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక టీ20 మ్యాచ్ను నిర్వహించాలంటే.. ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాలి. ఐసీసీ టోర్నీల్లో మాత్రం 10 ఓవర్ల చొప్పున ఆడాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడి నిర్ణీత ఓవర్లు సాధ్యం కాకపొతే మ్యాచ్ను రద్దు చేస్తారు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారితే.. ఆదివారం భారత్తో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
సీఏకు ఐసీసీ షాక్:
వర్షం ముప్పు నేపథ్యంలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకి 'రిజర్వ్ డే' ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరింది. కానీ.. ఐసీసీ మాత్రం సీఏ అభ్యర్థనని తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో సీఏతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా భారీ షాక్ తగిలింది.
టైటిల్ ఫేవరెట్గా భారత్:
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయినప్పటి నుండి భారత జట్టు ఒక్కసారి కూడా సెమీస్ దాటలేదు. 2018లో హర్మన్ప్రీత్ సేన ఇంగ్లాండ్తో సెమీస్లో ఢీకొని అక్కడి నుంచే నిష్క్రమించింది. ఇక ప్రస్తుత టోర్నీలో మాత్రం భారత్ హవా నడుస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు లీగ్ మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా భారత్ ఉంది.