ముంబై: ఈ ఏడాది కూడా మూడు జట్లతోనే మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ (మహిళల ఐపీఎల్) నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మొగ్గుచూపుతోంది. ఈసారి నాలుగు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహిద్దామనుకున్నా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తన నిర్ణయాన్ని బీసీసీఐ మార్చుకున్నట్లు తెలిసింది. నాలుగో జట్టును చేర్చాలని బీసీసీఐ గత సీజన్ నుంచి అనుకుంటోంది. వచ్చే ఈడికల్లా అన్ని సవ్యంగా సాగితే.. మరో జట్టును బీసీసీఐ చేర్చనుంది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పురుషుల ఐపీఎల్ గతేడాది యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లీగ్ ప్లే ఆఫ్స్ సమయంలో మహిళల టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో మహిళల బిగ్బాష్ జరగడంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు టీ20 చాలెంజ్కు దూరమయ్యారు. ఈసారి అలాంటి సమస్య లేకుండా లీగ్కు రూపకల్పన చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నది.
మహిళల ఐపీఎల్ షెడ్యూల్ విషయంపై తుది నిర్ణయం శుక్రవారం జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకోనున్నారు. అపెక్స్ కౌన్సిల్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల ఐపీఎల్ నాలుగో ఎడిషన్లో కూడా సూపర్ నొవాస్, వెలాసిటీ, ట్రైల్బ్లేజర్ జట్లు తలపడనున్నాయి. ఈ మూడు జట్లకు హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన కెప్టెన్లు. టోర్నీలో భాగంగా గతేడాది నాలుగు మ్యాచ్లు జరిగాయి.
Chetan Sakariya: అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన టెంపో డ్రైవర్ కొడుకు.. అతని వెనుక ఓ విషాద గాధ!