ముంబై: ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ కోసం యువ క్రికెటర్ పోప్ జట్టులో తన స్థానాన్ని త్యాగం చేయక తప్పదని మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. నైట్క్లబ్ ఎదుట గతేడాది ఒక వ్యక్తిని గాయపరిచిన కేసులో విచారణ ఎదుర్కొన్న బెన్స్టోక్స్ను ఇటీవల కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 12 మందితో కూడిన ధర్మాసనం స్టోక్స్ ఆత్మరక్షణ కోసమే దాడి చేశాడన్న వాదనను నమ్ముతూ నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ ఆల్రౌండర్కు జట్టులో చోటు కల్పించింది.
'పోప్ని తుది జట్టు నుంచి పక్కన పెట్టమని చెప్తున్నందుకు నాకు కొంచెం కంగారుగానే ఉంది. ఇది సమంజసం కూడా కాదు. ఎందుకంటే.. లార్డ్స్ టెస్టులో అతను మెరుగ్గా ఆడాడు. కానీ.. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. పోప్కి మళ్లీ ఆడే అవకాశం తప్పకుండా వస్తుంది. మూడో టెస్టుకి ఆరుగురు బౌలర్లు ఇంగ్లాండ్కి అవసరం లేదు.'
'ఇప్పటికే జట్టులో క్రిస్వోక్స్, కర్రాన్ రూపంలో ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు. తొలి టెస్టులో కుర్రాన్, రెండో టెస్టులో క్రిస్వోక్స్ ప్రదర్శన తర్వాత వారిని మూడో టెస్టు నుంచి తప్పించే సాహసం చేయలేం. కాబట్టి.. ఇప్పుడు బెన్స్టోక్స్ తుది జట్టులోకి రావాలంటే.. పోప్ని పక్కన పెట్టడం ఒక్కటే దారి' అని నాసర్ హుస్సేన్ వెల్లడించాడు.
ఇలా.. శనివారం నుంచి నాటింగ్హామ్ వేదికగా భారత్తో జరగనున్న మూడో టెస్టులో అతని పునరాగమనానికి మార్గం సుగమమైంది. కోర్టులో విచారణ కారణంగా.. ఆదివారం ముగిసిన లార్డ్స్ టెస్టుకి స్టోక్స్ దూరమైన విషయం తెలిసిందే. ఈ టెస్టుతోనే పోప్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా.. తాజాగా అతను జట్టులో తన స్థానాన్ని వదులుకోక తప్పదని నాజర్ వెల్లడించాడు. ఐదు టెస్టుల సిరీస్లో రెండు టెస్టులు ముగియగా.. ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రెండో టెస్టుకు స్టోక్స్కు దూరం కావడంతో పోప్ను అతని స్థానంలో తీసుకుంది. జట్టులోకి అయితే తీసుకుంది గానీ, స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడు ఈ యువ క్రికెటర్.