హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లలో తొలిసారిగా కెప్టెన్సీ చేపట్టబోతున్న రవిచంద్రన్ అశ్విన్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను నడిపించే విషయంలో సహచరుడు యువరాజ్ సింగ్, జట్టు మార్గదర్శి వీరేంద్ర సెహ్వాగ్ల నుంచి సలహాలు తీసుకుంటానని చెప్పాడు. 'నా కెరీర్లో వేర్వేరు దశల్లో వీరూ, యువరాజ్ నాకు కెప్టెన్లుగా ఉన్నారు. నా అనుభవానికి తోడు.. వీరి నుంచి సలహాలు తీసుకుని జట్టును నడిపించాలనుకుంటున్నా'' అని అశ్విన్ చెప్పాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అంచనాలకు అందకుండా బ్యాటింగ్ చేయిస్తానని తెలిపాడు. జనవరిలో జరిగిన వేలంలో రూ. 7.6కోట్లకు కొనుగోలు అయినప్పటి నుంచి అశ్విన్నే జట్టులో కీలక వ్యక్తిగా పరిగణిస్తున్నారు. 2015 సీజన్ నుంచి ఐపీఎల్ కుదూరమైన అశ్విన్ రెండు సీజన్ల విరామం తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడతాడని అందరూ ఊహించారు. కానీ వేలంలో ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయ్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. 'అనుభవం కలిగిన బౌలింగ్ లైనప్ లేకపోయినప్పటికీ, మంచి బౌలర్లను కలిగి ఉన్నాం. జట్టులో అత్యుత్తమ ప్రదర్శనను అశ్విన్ రాబట్టగలడని నమ్ముతున్నా' అని సెహ్వాగ్ అన్నాడు.
'బౌలింగ్ కెప్టెన్ మ్యాచ్లు గెలిపించగలడు. చివరి ఓవర్లో 8, 10, 15 పరుగులు అవరమైనప్పుడు బౌలర్లు మాత్రమే మ్యాచ్లు గెలిపించగలరు. బౌలింగ్ కెప్టెన్ ఆలోచనా విధానం కాస్తంత వైవిధ్యంగా ఉంటుంది. అందుకే కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్ను నేను ఇష్టపడేది' అని తెలిపాడు.