హైదరాబాద్: ముంబై క్రికెట్ అసోయేషన్ ముంగిట మరో వివాదం వచ్చిపడింది. టీమిండియాకు స్టార్ క్రికెటర్లను అందించిన క్రికెట్ సంఘానికి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. అసోసియేషన్కు సంబంధించిన రెండు నెలలుగా ఆటగాళ్లకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని తెలిసింది. సుప్రీం కోర్టు నుంచి అనుమతి రాగానే డబ్బులు చెల్లిస్తామని ఎంసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇదే విషయమై ఇప్పటికే సంఘం సభ్యుడొకరు సుప్రీం కోర్టును సంప్రదించారు. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయస్థానం ఆదేశించిన వెంటనే అవసరమైన చెల్లింపులు చేసేస్తామని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఎంసీఏకు పాలకులు లేరు. ఆరోపణలు రావడంతో బాంబే హైకోర్టు నియమించిన ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు ఆవేదనతో తమ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో ఎంసీఏ బ్యాంకు ఖాతాలు నిర్వహించే వారు కరవయ్యారు. అందుకే ఆటగాళ్లు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోయారు. ఇదే ఇబ్బందితో వాంఖడేలో నిర్వహించాల్సిన వన్డేను బ్రబౌర్న్ మైదానానికి తరలించిన సంగతి తెలిసిందే. వేతనాలు చెల్లించకున్నా సిబ్బంది ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
'ఎంసీఏ అనుబంధ క్లబ్లను కలిశాం. సిబ్బందికి వేతనాలు అందించేందుకు సాయం కోరాం. అందుకు వారు సమ్మతించారు. త్వరలోనే క్లబ్ సభ్యులతో సమావేశం నిర్వహిస్తాం' అని పార్సీ జింఖానా ఉపాధ్యక్షుడు ఖోడాడాడ్ తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.35,000 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారికీ చెల్లింపులు చేయలేదు.